ఇది వైయస్‌ఆర్‌ సిపి నిరసన యాత్ర

 
- నిరసన తెలిపేందుకే షర్మిల పాదయాత్రలో నల్లబ్యాడ్జీ ధరిస్తారు
- రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది
- ధరలు, చార్జీలతో ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తోంది
- దానిపై అవిశ్వాసం పెట్టకుండా కాంగ్రెస్‌తో టిడిపి కుమ్మక్కైంది
- ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా కల్పించాలని జగన్ ‌నిర్ణయం
- ఆయన తరఫున సోదరి షర్మిల ప్రజల్లోకి వస్తున్నారు

హైదరాబాద్, 15 అక్టోబర్‌ 2012: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేయనున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ ఒక నిరసన పాదయాత్ర అని యాత్ర సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, ఈ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టి పడగొట్టే అవకాశం ఉన్నా అలా చేయకుండా నాటకాలాడుతున్న టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా ఈ యాత్ర చేపడుతున్నారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కమిటీ సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, తలశిల రఘురామ్, యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డితో కలిసి‌ ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

షర్మిల చేపడుతున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర భారత దేశ రాజకీయ యవనికపై ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోందని భూమన అభివర్ణించారు. ప్రజాద్రోహానికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ‌టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తగుదునమ్మా అంటూ పాదయాత్రకు వెళ్లడం ప్రజలను మోసగించడమే అని ఆయన విమర్శించారు.

ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్న ప్రభుత్వం:
‘రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ప్రజల ఆకాంక్షలను ఏ మాత్రం నెరవేర్చకుండా నిరంతరం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. నిత్యావసర సరకుల ధరల పెంపుదలకు కారణమైంది. 13 వేల కోట్ల రూపాయల మేరకు విద్యుత్ చార్జీలు, ఇంధన స‌ర్‌చార్జీల భారాన్ని ప్రజలపై మోపింది. మూడు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచింది. విద్యార్థులను అయోమయానికి గురిచేస్తూ వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడేలా ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం పట్ల వ్యవహరిస్తోంది. కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానా‌లు అనుసరిస్తోంది. సమాజంలో ఏ ఒక్క వర్గ ప్రజల జీవితాలు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో సంతోషంగా లేని పరిస్థితి నెలకొంది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో దాదాపు 75 లక్షల మందికి తెల్లకార్డులు ఇస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిలో 25 శాతానికి పైగా తీసేసింది. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను అధిక సంఖ్యలో తొలగించింది. వారికి 3, 4 నెలలకు ఒకసారి కూడా పెన్షన్లు రాని పరిస్థితి. ఇలా ప్రజల జీవితాలను, వారి మూలుగులను ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తోంది’ అని భూమన విమర్శించారు.

అవిశ్వాసం పెట్టకుండా ప్రతిపక్షం కుమ్మక్కైంది:
‘ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మెడలు వంచాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైంది. వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్‌ జగన్మోహన్‌రెడ్డికి రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణను చూసి భయపడుతున్న టిడిపి అధికారపక్షంతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టకుండా లాలూచీ పడుతోంది. ప్రధాన ప్రతిపక్షం ప్రకటనల్లో‌ పైపైన మాత్రమే విమర్శలు గుప్పిస్తూ ఆచరణలో అధికారపక్షంతో కలిసిపోయింది. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ను నిర్వీర్యం చేయాలనే ఆలోచనలతో ప్రతిపక్షం ప్రభుత్వంతో సయ్యాటలాడుతోంది. ఇలాంటి ప్రజా కంటక ప్రభుత్వ వైఖరికి, ప్రతిపక్ష లాలూచీ రాజకీయాలకు నిరసనగా వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలు షర్మిల నల్ల బ్యాడ్జీ ధరించి పాదయాత్ర చేస్తున్నారు’ అని కరుణాక‌ర్‌రెడ్డి పేర్కొన్నారు.

జైల్లో ఉన్నా జనం గురించే జగన్ ఆలోచన:
‘ఈ అధికారపక్ష, ప్రతిపక్షాల వైఖరులపై నిరసన తెలపడంతో‌ పాటు, ఇలాంటి సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పేందుకు, భవిష్యత్తుపై వారికి భరోసా ఇచ్చేందుకు పార్టీ తరఫున ప్రజలతో మమేకం కావాలనే జగన్మోహన్‌రెడ్డి నిరంతరం ‌కోరుకుంటున్నారు. జైల్లో ఉంటూ కూడా ఆయన నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. జగన్ ఆదేశా‌లు, పార్టీ సూచనల మేరకు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లను తుడుస్తూ వారికి భవిష్యత్తు మీద భరోసా ఇచ్చేందుకే ఆమె వస్తున్నారని భూమన పేర్కొన్నారు. 

'జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాబోయే ప్రభుత్వంలో వైయస్ సువర్ణ‌ యుగాన్ని మళ్లీ చూడవచ్చని, పెద్దాయన ఆశయాలకు కొనసాగింపుగా సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతాయని పాదయాత్ర సందర్భంగా ప్రజలకు షర్మిల భరోసా ఇస్తారు. వృద్ధులు, వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని, ఫీజుల రీయింబ‌ర్స్‌మెంట్ పథకాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేస్తామని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని,  వ్యవసాయ‌ రంగానికి 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ నిరాఘాటంగా ఇస్తామని, ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపబోమని భరోసా ఇస్తారు’ అని కరుణాక‌ర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ పాదయాత్ర పట్ల తెలుగుజాతి యావత్తు ఆసక్తితో, ఉత్సాహంతో ఎదురు చూస్తోందని, తామూ భాగస్వాములం కావాలని ప్రజలు తహతహలాడుతున్నారని అన్నారు.

హంగూ ఆర్భాలు వద్దు:
పాదయాత్ర సందర్భంగా వైయస్‌ అభిమానులు, వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చే‌యవద్దని, పూలు చల్లడం లాంటి కార్యక్రమాలు అసలే వద్దని కరుణాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముందుగా రూపొందించిన రూట్‌మ్యాప్ ప్రకారమే‌ షర్మిల పాదయాత్ర సాగుతుందని, దీనిలో ఏ చిన్న పాటి మార్పులు కూడా ఉండబోవని, ఈ విషయం స్థానిక నాయకులు గుర్తించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో ఈ నిరసన యాత్ర నిర్వహించకపోవడానికి ప్రత్యేక కారణాలేమీ లేవనీ చంద్రబాబు, ముఖ్యమంత్రుల జిల్లా అయినంత మాత్రాన తమ పార్టీకి అక్కడ ఎలాంటి ఇబ్బందులూ లేవని, చాలా పటిష్టంగా ఉన్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టిడిపి పార్టీ నుంచే తమ పార్టీలోకి భారీగా వలసలు వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉందన్నారు. 3,000 కిలో మీటర్ల మేర 16 జిల్లాల్లో సుమారు ఆరు నెలల పాటు మరో ప్రజాప్రస్థానం సాగుతుందన్నారు.

‘మరో ప్రజా ప్రస్థానం’ సాగేదిలా :
వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల ఈ నెల 18 నుంచి చేపట్టనున్న నిరసన పాదయాత్రకు సంబంధించిన తొలి ఐదు రోజుల షెడ్యూలును పార్టీ కార్యాలయం ఆదివారం వెల్లడించింది. తొలి రోజున ఉదయం 11 గంటలకు ఇడుపులపాయ వద్ద బహిరంగ సభ అనంతరం షర్మిల వీరన్నగట్టుపల్లె, కుమ్మరాంపల్లె, వేంపల్లె నుంచి నాలుగు రోడ్ల కూడలి, రాజీవ్‌నగర్ కాలనీ వరకూ పాదయాత్ర చేస్తారు. రెండో రోజు రాజీ‌వ్‌నగర్ కాలనీ నుంచి నందిపల్లె, తాళ్లపల్లె, దుగ్గన్నపల్లె, అమ్మయ్యగారిపల్లె, చాగలేరు క్రా‌స్, వి.కొత్తపల్లె, గొందిపల్లె క్రా‌స్, వేముల, భూమయ్యగారిపల్లె క్రా‌స్ వరకూ వెళతారు. మూడో రోజు అక్కడి నుంచి వేల్పుల, బెస్తవారిపల్లె, పులివెందుల ఆర్టీసీ బస్టాండ్, పూల అంగళ్ల మీదుగా పార్నపల్లె రోడ్డు, రింగురోడ్డు సర్కి‌ల్ నుంచి వై‌యస్‌ఆర్ గృహానికి వెళతారు. నాలుగో రోజు పులివెందుల రింగ్‌రోడ్డు నుంచి చిన్న రంగాపురం, ఇప్పట్ల, చిన్నకుడాల క్రాస్, పెద్దకుడాల క్రా‌స్, లింగాల, లోపట్నూతల క్రా‌స్ వరకూ పాదయాత్ర చేస్తారు. ఐదో రోజున కర్ణపాపయ్యపల్లె, వెలిదండ్ల, నేర్జాంపల్లె, పార్నపల్లె వరకూ యాత్ర కొనసాగుతుంది. ఆ తరువాతి యాత్ర వివరాలు తదుపరి వెల్లడిస్తారు.
Back to Top