తాడేపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును వైయస్ఆర్సీపీ స్వాగతించింది. మహిళా సాధికారతకు తొలి అడుగు వైయస్ జగన్ వేసారని, వైయస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలోనే మహిళలకు పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్ధం చేశారని పార్టీ మహిళా విభాగం నేతలు స్పష్టం చేశారు. మహిళలను రాజకీయ, సామాజికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో మహిళా నేతలు పేర్కొన్నారు. విశాఖలో వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళా నేతలు ప్రెస్మీట్లో ఏమన్నారంటే..వారి మాటల్లోనే .. - జగనన్న మహిళా పక్షపాతి: వరుదు కళ్యాణి, వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో మహిళలను రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచే కృషి చేశారు. మహిళా రక్షణకు పెద్దపీట వేస్తూ దిశ చట్టం, దిశ యాప్ తీసుకువచ్చి, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రతి సచివాలయంలో మహిళా పోలీసులను ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి మహిళలకు న్యాయం త్వరగా అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలే ప్రధాన లబ్ధిదారులుగా రూపొందించారు. అమ్మ ఒడి, చేయూత, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరిచారు. రాజ్యాంగం ఇవ్వకపోయినా స్థానిక సంస్థల్లో 50 శాతం కంటే ఎక్కువగా మహిళలకు అవకాశాలు కల్పించి రాజకీయ సాధికారతకు బాటలు వేశారు. వైయస్ జగన్ పాలనలో మహిళలు రాజ్యాంగ పదవుల్లో గౌరవంగా సేవలందించారు. ఇవాళ మహిళా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకరం. ఈ బిల్లుకు వైయస్ఆర్సీపీ మొదటి నుంచే మద్దతు ఇస్తోంది. కానీ టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి మా పాలనను ‘డార్క్ పిరియడ్’ అని చెప్పడం అభ్యంతరకరం. మా పాలన మహిళలకు గోల్డెన్ పిరియడ్. నిజమైన డార్క్ పిరియడ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాతే ప్రారంభమైంది. మీ పాలనలో మహిళలకు రక్షణ లేదు. అధికార పార్టీ ఎంపీగా బైరెడ్డి శబరిని సీఎంవో అధికారి అవమానిస్తే మందలించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబబు, లోకేష్ అతనికే మద్దతుగా నిలిచారు. ఎంపీకే గౌరవం లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది?. మహిళల గౌరవం గురించి మాట్లాడే ముందు మీరు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలి. మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు వైయస్ జగన్ గారే. మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ, మహిళల కోసం పనిచేసిన ఆయనకు మా మహిళా విభాగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. - మహిళలను సాధికారత వైపు నడిపించిన నాయకుడు వైయస్ జగన్: కాకాణి పూజిత, వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలకు అండగా నిలబడటమే కాదు, వారిని సాధికారత వైపు నడిపించిన నాయకుడు వైయస్ జగన్ గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు మహిళల కోసం అహర్నిశలు కృషి చేశారు. మహిళా బిల్లుకు ఇవాళ చాలామంది మద్దతు తెలుపుతున్నా, నిజంగా ఆ బిల్లుకు మద్దతు చెప్పే అర్హత వైయస్ జగనన్న తర్వాతే మిగతా వారికుంటుంది. రాజకీయంగా మహిళా సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపారమైంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, దేశ చరిత్రలోనే కొత్త దిశ చూపించారు. తన కేబినెట్లో డిప్యూటీ సీఎం నుంచి హోం, ఆరోగ్య, విద్య, స్త్రీ-శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను మహిళలకు అప్పగించి మహిళలపై విశ్వాసాన్ని చాటారు. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్గా ముస్లిం మహిళకు అవకాశం కల్పించడం, చీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమిషనర్గా మహిళలను నియమించడం..ఇలా మహిళలకు సముచిత స్థానం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 50 శాతం కంటే ఎక్కువగా అవకాశాలు ఇచ్చి మహిళలను ముందువరుసలో నిలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత కల్పించారు. మహిళల హక్కులు, గౌరవం కోసం నిజంగా పనిచేసిన నాయకుడు వైయస్ జగన్ గారే. మహిళా సాధికారత గురించి ఎప్పుడైనా చర్చ జరిగితే ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఆయనకు రుణపడి ఉంటారు. - ఐదేళ్ల క్రితమే మహిళా సాధికారతకు వైయస్ జగన్ శ్రీకారం: రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని తీసుకున్న నిర్ణయం అభినందనీయం. వైయస్ఆర్సీపీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. మా పార్టీ అధినేత వైయస్ జగన్ మహిళా సాధికారతకు ఐదేళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన స్టేజీ మీదే మహిళల అభ్యున్నతి గురించి ఆలోచించారు. మహిళా రిజర్వేషన్కు తొలి అడుగు వేసింది వైయస్ జగనే. దేశంలోనే మహిళలకు పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, చట్టబద్ధం చేసిన నాయకుడు వైయస్ జగనే. మహిళగా ఆయన చేసిన ఈ చట్టంపై నేను గర్వంగా చెబుతున్నాను. వైయస్ జగన్ తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణిని నియమించారు. నలుగురు మహిళలను మంత్రులుగా చేశారు. రెండు విడతల్లో మహిళలను హోం మంత్రులుగా నియమించారు. తొలి చీఫ్ సెక్రటరీగా, ఎలక్షన్ కమిషనర్గా మహిళలకు అవకాశం కల్పించారు. ఇంతగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగనే అని నేను గర్వంగా చెబుతున్నాను. స్థానిక సంస్థల్లో మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించారు. జెడ్పీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా 50 శాతం మహిళలను నియమించారు. మున్సిపల్ కార్పొరేటర్లలో 54 శాతం మహిళలకు అవకాశం ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థలో 53 శాతం మహిళలను, గ్రామ–వార్డు సచివాలయాల్లో 51 శాతం మహిళా ఉద్యోగినిలను నియమించారు. మహిళలకు రిజర్వేషన్లు చేస్తూ చట్టం చేయడం దేశ చరిత్రలో తొలిసారి వైయస్ జగన్ పాలనలోనే జరిగింది. మహిళలు ముందువరుసలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన పనిచేశారు. మహిళా సాధికారత కోసం రూ.2.74 లక్షల కోట్లు నేరుగా మహిళలకే డీబీటీ ద్వారా అందించారు. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, పోలీస్ వ్యవస్థలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఆనందంగా ఉంది. వైయస్ జగన్ సారథ్యంలో ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం.మహిళా మేయర్గా నేను ఐదేళ్లు పనిచేయగలిగానంటే, నా వంటి ఎంతోమంది మహిళలు రాజకీయంగా ఎదగాలని వైయస్ జగన్ ఇచ్చిన అవకాశమే కారణం. ఇలాంటి నాయకత్వంలో పని చేయడం నాకు గర్వంగా ఉంది.