<strong>పార్టీకి.. ప్రభుత మీటింగ్కు తేడా లేకుండా చంద్రబాబు వ్యాఖ్యలు</strong><strong>జననేత పాదయాత్ర జోరుకు విలవిలలాడుతున్న 40 ఏళ్ల అనుభవం</strong><strong>ప్రజాభిమానానికి టీడీపీ మాడిమసైపోతుంది</strong><strong>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ ఇక్బాల్</strong><br/><strong>విజయవాడ</strong>: చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ ఇక్బాల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ మీటింగ్లో పార్టీకి ఓటు వేయండి అని చంద్రబాబు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పార్టీకి ప్రభుత్వానికి తేడా లేకుండా చంద్రబాబు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్బాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీతాలు పెంచాం.. ఓట్లు వేయాలని అంగన్వాడీలను చంద్రబాబు అడుగుతున్నారన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వ్యవహరిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క బీసీలకే 110 హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. <br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర జోరుకు 40 ఏళ్ల అనుభవం విలవిలలాడుతోందన్నారు. అనుభవం ఉన్న రాక్షసమూకలకు పట్టం కట్టామని జనం వాపోతున్నారన్నారు. అవినీతిలో టీడీపీ నేతలు డైనోసర్లుగా తయారయ్యారన్నారు. ఏ విధంగా చూసినా రాష్ట్రంలో టీడీపీ దోపిడీ.. లూటీలే కనిపిస్తున్నాయన్నారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి లేదు.. 2029, 2050 అంటూ అంకెలు చెబుతూ ఊహాలోకంలో విహరిస్తున్నారన్నారు. ప్రజలు విద్యా, వైద్యం, ఆరోగ్యం, రైతులు గిట్టుబాటు ధర కోరుకుంటుంటే.. చంద్రబాబు మాత్రం ప్రపంచాన్ని తలదన్నే కట్టడాలు అని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీ ద్వారా మా వాళ్లు బాగుపడాలి అనే దురుద్దేశంతో వందల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కాలంలో బలహీనవర్గాల వారిని పైకి తీసుకువచ్చారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. <br/>సన్రైజ్ స్టేట్ అంటూ మభ్యపెడుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. టీడీపీ ఎన్ని ఫేక్ సర్వేలు ఇచ్చినా.. పబ్లిష్ చేసినా ప్రజలు నమ్మడం లేదదన్నారు. చంద్రబాబుదంతా సూటు బూటు కల్చర్ వ్యవహరిస్తున్నారన్నారు. సింగపూర్ పేరుతో రాష్ట్ర రాజధానిని తాకట్టుపెట్టారన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి తెలుగుదేశం పార్టీ మాడిమసైపోతుందన్నారు.