ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌ జిల్లా రాజుపాలెం మండలం కొరప్రాడులో దొంతిరెడ్డి నారాయణరెడ్డి ప్రథమ వ‌ర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ..చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. రైతులు కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు రెయిన్‌గన్ల డ్రామా ఆడి ఇన్‌ఫుట్‌ సబ్సిడీకి ఎగనామం పెట్టారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్లు దోచుకుంటూ పచ్చ పార్టీ నేతలు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. స్వర్గీయ దొంతిరెడ్డి నారాయణరెడ్డి ఆశయ సాధనకు కృషి చేద్దామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వైయస్‌ వివేకానందరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ళ్లు శివప్రసాదరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైయస్‌ఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top