ఈ ప్రభుత్వం పడిపోతుంది!

మహబూబ్‌నగర్ 2 డిసెంబర్ 2012 : ప్రజల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వం తొందరలోనే పడిపోతుందని శ్రీమతి షర్మిల అన్నారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా ఆమె మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం 
లాల్‌కోట వద్ద 'రచ్చబండ' నిర్వహించారు. 
"60 ఏళ్లు దాటిపోయాను. నాకు పింఛను లేదు. నూరు రూపాయల కూలీ ఇవ్వాల్సి ఉంటే మా ఊళ్లో నలభై ముప్పై కట్టిస్తారా?" అంటూ ఒక మహిళ ఆక్రోశం వెళ్లగక్కింది. దీనికి స్పందించిన షర్మిల ఈ ప్రభుత్వం త్వరలోనే పతనమౌతుందన్నారు.
"కిరణ్ కుమార్ రెడ్డిగారు ఈ అవ్వ ముందర నిలబడితే చొక్కా పట్టుకు మరీ అడిగేది. (నవ్వుతూ) ఏమవ్వా కిరణ్ కుమార్ రెడ్డిగారితో ఒక అపాయింట్‌మెంట్ తెప్పించుకో." అని షర్మిల వ్యాఖ్యానించారు.
 "రాజన్న బతికున్నప్పుడు ఉపాధి హామీ పని అద్భుతంగా జరిగేది. నూరు రూపాయలు, నూటా ఇరవై రూపాయలు ఇచ్చేవాళ్లు. అవునా! ఇప్పుడున్న ప్రభుత్వం కరువు పనులు చేయించుకుంటున్నారు గాని, ముప్పై రూపాయలు, నలభై రూపాయలు ఇస్తున్నారట. ఇది చాలా అన్యాయం. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు." అని ఆమె విమర్శించారు.
"ఇది శ్రమ దోపిడీ. మీ శ్రమను దోచుకుంటోంది ఈ ప్రభుత్వం. రాబందుల రాజ్యమంటారు దీన్ని. చాలా అన్యాయం చేస్తున్నారవ్వా. నీ ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వం తొందరగా పడిపోతుంది."అని షర్మిల ముక్తాయించారు.
'రచ్చబండ'లో విద్యార్థులు, కళాకారులు, రైతులు షర్మిలతో తమ కష్టాలు చెప్పుకున్నారు. చంద్రకళ అనే విద్యార్థిని తమకు బస్సులు సమయానికి రావడం లేదని ఫిర్యాదు చేసింది. ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి కానీ ఆర్డినరీ బస్సులు ఉండడం లేదని ఆ విద్యార్థిని వాపోయింది.
రచ్చబండలో పాలమూరు కళాకారుల కష్టాలను షర్మిల అడిగి తెలుసుకున్నారు. కళాకారుల కోరిక మేరక కాస్సేపు డప్పు వాయించి అందరినీ అలరించారు.  మంచినీరు రావడం లేదని, కరెంట్‌కోతలతో ఇబ్బందులు పడుతున్నామని షర్మిలతో స్థానికులు వాపోయారు. మహానేత వైయస్ ఉన్నప్పుడు బ్యాంక్ రుణాలు మాఫీ చేశారని, ఇప్పడు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని  మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ హయాంలో అందిన అన్ని సదుపాయాలూ నేడు తమకు దూరమయ్యాయని వారు వాపోయారు. వారిని ఓదార్చిన షర్మిల రాజన్న రాజ్యంతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం లేదనీ, మంజూరైన ఇళ్లకు కూడా బిల్లులు రావడం లేదనీ స్థానికులు చెప్పారు. దీనికి ప్రతిస్పందిన షర్మిల నాడు దివంగత మహానేత వైయస్ హయాంలో రాష్ట్రంలో 45 లక్షల ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. జగనన్న సిఎం అయ్యాక పక్కాఇళ్ల సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పత్తికి గిట్టుబాటు ధర ఉండడం లేదని కొందరు రైతులు షర్మిలకు చెప్పారు. రాజన్నరాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని ఆమె వారిని ఓదార్చారు.
శ్రీమతి షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' ఆదివారం నెల్లికొండి గ్రామ శివారు ప్రాంతం నుంచి యాత్ర ప్రారంభమైంది
లాల్ కోటశివార్లలో పత్తి రైతులతో కూడా మాట్లాడారు. పత్తికి గిట్టుబాటు ధర ఉండడం లేదని రైతులు షర్మిలకు చెప్పి వాపోయారు. కరెంటు కోతలతో పరిస్థితులు దుర్భరంగా తయారయ్యాయన్నారు. కరువు పనులకు కూడా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. దివంగత మహానేత వైయస్ హయాంలో గిట్టుబాటు ధర లభించిందన్నారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజన్నరాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల వారికి ధైర్యం చెప్పారు.
చంద్రబాబు హయాంలో 16 లక్షల వృద్ధాప్యం పెన్షన్లు మంజూరు చేస్తే, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డిగారు 71 లక్షల పెన్షన్లు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. మానసిక వికలాంగులను కూడా పెన్షన్లకు అర్హులుగా గుర్తించింది వైయస్సేనన్నారు. 
Back to Top