చంద్రబాబు వీధి బాగోతాలు: వైయస్‌ఆర్‌ సిపి

- దమ్ముంటే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టండి 
- ఎవరిది కుమ్మక్కో రాష్ట్ర ప్రజలకు తెలుసు
- ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాలకు పాల్ప‌డినా కేసులు లేవేం? 
- కాంగ్రెస్‌- టిడిపి కుమ్మక్కుకు ఇంత కన్నా రుజువేమిటి?
- వివాదాస్పద జీవోలతో సంబంధం లేకున్నా జగన్‌ను జైలుపాలు చేశారు
- కాంగ్రెస్‌లో ఉంటే జగన్ సీఎం అయ్యేవారని ఆజాదే అన్నారు
- జారిపోతున్న శ్రేణులను కాపాడుకునేందుకే బాబు పాదయాత్ర

హైదరాబాద్, ‌4 అక్టోబర్‌ 2012: పాదయాత్ర పేరుతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వీధి బాగోతం ఆడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ ‌ప్రభుత్వం అవినీతిమయం అయిందని ఇప్పుడు సన్నాయినొక్కులు నొక్కుతున్న చంద్రబాబుకు నిజంగా దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టి దించేయాలని సవాలు విసిరింది. పార్టీ అధికార ప్రతినిధి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ‘అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టడం మీ చేతిలో పని కాదా? అయినా ఆ పని చేయకుండా దాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నది మీరు కాదా? అవిశ్వాసం పెట్టబోనని, ప్రభుత్వాన్ని కూల్చబోనని పత్రికాముఖంగా ప్రకటించిందీ మీరు కాదా?’ అని బాబును సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీతో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కుమ్మక్కయింద‌ంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పద్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతను అన్న ఇంగితాన్ని కూడా విస్మరించి అధికార కాంగ్రెస్‌తో మూడేళ్లుగా అడుగడుగునా అంటకాగుతున్న చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని పద్మ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరు చూస్తే 'దొంగే తిరిగి దొంగా దొంగా’ అని అరిచిన చందంగా ఉందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను బాబు తన భుజస్కంధాలపై మోస్తున్న వైనాన్ని రాష్ట్రమంతా గమనిస్తూనే ఉందని వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. పక్కా అవగాహన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కంటికి రెప్పగా కాపాడుతున్నది చంద్రబాబే అని ఆమె స్పష్టం చేశారు.

రోజురోజుకూ చేజారిపోతున్న తన పార్టీ శ్రేణులను ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పాదయాత్ర పేరుతో వీధి నాటకాలాడుతూ బాబు ఆపసోపాలు పడుతున్నారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాదయాత్రకు అంతకంటే పరమార్థం ఇంకేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో రాజీపడని కారణంగానే జగన్మోహన్‌రెడ్డి తనకు ఎలాంటి సంబంధమూ లేని 26 జీవోల విషయంలో జైల్లో ఉన్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. జగన్ కాంగ్రె‌స్‌లోనే ఉండి ఉంటే కేంద్ర మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇ‌న్‌చార్జి గులాం నబీ ఆజాదే ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎవరి దగ్గర ఎవరు రాజీ పడ్డారో చెప్పేందుకు ఇది చాలదా అని బాబును నిలదీశారు.

'ఆరుపదులు దాటిన వయసులో నిన్ను నువ్వు హింస పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకుంటున్నావు. అంత హింస నీకెందుకు బాబూ? వైయస్ ‌అనంతరం కాంగ్రెస్ పాలనలో జనాలకు నిత్యం కష్టాలే ఎదురవుతున్నాయి కదా? ఇళ్ల మాట దేవుడికెరుక, కనీసం పరిశ్రమలకైనా కరెంటు సరఫరా చేసే దిక్కు లేదు. కొత్తగా ఒక్క రేషన్ కార్డు గానీ, బలహీన వర్గాలకు ఒక్క ఇల్లు గానీ,‌ అర్హులకు ఒక్క పెన్ష‌న్ గానీ లేవు. పైగా కరెంటు నుంచి ఎరువుల దాకా అన్నింటి ధరలూ ఎడాపెడా పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానంతో కూలదోయడం నీ చేతిలో పని కాదా? ఆ పని చేయకుండా, అదే కాంగ్రెస్‌తో అడ్డంగా రాజీ పడిందీ, అవిశ్వాసం పెట్టకుండా రోడ్లపై పడి తిరుగుతున్నదీ నువ్వే కదా? అందుకే కదా బాబూ ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాలకు పాల్ప‌డినా, అతి విలువైన భూములను అప్పనంగా అస్మదీయులకు పంచిపెట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీపై ఏ కేసులూ పెట్ట‌లేదు' అని పద్మ వ్యాఖ్యానించారు.

'ఎమ్మార్ విషయంలో కేవలం సంపన్నుల విలాసాల కోసం అ‌త్యంత విలువైన వందలాది ఎకరాలను కారుచౌకగా రాసిచ్చింది చంద్రబాబూ నీవే కదా. అయినా నీపై కేసుల ఊసు కూడా లేదంటే, కేవలం కాంగ్రెస్‌తో కుమ్మక్కవడమే కారణం కాదా? ఎమ్మెల్సీ ఎన్నికలు మొదలు తాజా ఉప ఎన్నికల దాకా కాంగ్రెస్‌తో నువ్వు ఓట్ల మార్పిడి చేసుకున్నది అబద్ధమా? మీ పరస్పర కుమ్మక్కే అందుకు కారణమన్నది అబద్ధమా?’ అని బాబును పద్మ తూర్పారబట్టారు.‌ ఏ దశలోనూ కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కవలేదనేందుకు నడిచిన, నడుస్తున్న చరిత్రే తిరుగులేని సాక్షి అని ఆమె స్పష్టం చేశారు. ఆజాద్ వ్యాఖ్యలు కూడా దానికి అద్దం పట్టాయన్నారు. ‘వివాదాస్పదం అంటున్న ఆ 26 జీవోలపై సంతకం పెట్టడం దేవుడెరుగు, వాటితో కనీసం సంబంధం కూడా లేకున్నా జగన్‌ను ప్రభుత్వ పెద్దలు జైలుపాలు చేశారు. స్వయంగా అతి భారీ భూ కుంభకోణాలకు పాల్పడ్డ బాబు మీద ఈ ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు’ అని దుమ్మెత్తిపోశారు.

అక్కడా అనుకూలమేగా...

కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై కూడా మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరగని పనిని, అందుకు ములాయంసింగ్ మద్దతివ్వరని, కాబట్టి లో‌క్‌సభకు కూడా ముందస్తు ఎన్నికలు రానే రావని కూడా చంద్రబాబే తేల్చేస్తున్న వైనాన్ని పద్మ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలకు అనుకూలంగా ఇంత బాహాటంగా మాట్లాడుతున్న ఆయన, ఏ ముఖం పెట్టుకుని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌పై కుమ్మక్కు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

త్యాగమన్నట్టు పోజొకటి!:
పాదయాత్ర పేరుతో పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకు, ప్రజల సానుభూతి పొందేందుకు మాత్రమే బాబు తాపత్రయపడుతున్నారని పద్మ విమర్శించారు. ‘వయస్సు మళ్ళినా మీ కోసం వచ్చానంటూ అదేదో త్యాగం చేస్తున్నట్టుగా బాబు పోజు కొడుతున్నారని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. రాత్రంతా నిద్ర పట్ట లేదని, పిక్కలు పట్టేశాయని పదేపదే చెప్పుకుంటున్నారు. ఒక్క రోజుకే పిక్కలు పట్టేస్తే ఎలా? కాళ్లు వాచిపోయే రోజులు కూడా వస్తాయి’ అని ఎద్దేవా చేశారు. చనిపోవడానికైనా సిద్ధమంటూ హాస్యాస్పద వ్యాఖ్యలకు బాబు తెర తీశారని అన్నారు. ‘రెండేళ్లుగా భార్యాపిల్లలకు దూరంగా, నిత్యం ప్రజల మధ్యనే జగన్మోహన్‌రెడ్డి గడిపారు. కానీ ఆయన తనకు కలిగిన దుర్భరమైన శారీరక బాధలను ఏ రోజూ ఎవరికీ చెప్పుకోలేదు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ, జ్వరంతో బాధ పడుతూ కృశించినా అంతటి బాధలను కూడా పక్కవారికైనా చెప్పుకోలేదాయన’ అని గుర్తు చేశారు.
Back to Top