ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి

హైదరాబాద్, 30 సెప్టెంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక ‌న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీనితో సుదీర్ఘ కాలం తరువాత శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇడుపులపాయ వెళ్లనున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సమాధివద్ద‌ ఆయన నివాళులు అర్పించనున్నారు.

ఇడుపులపాయ వెళ్ళేందుకు, తన తండ్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వీలుగా తన బెయిల్ షరతులను సడలించాలని శ్రీ జగన్‌ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అక్టోబర్ 1, 2 తేదీలలో  ఇడుపులపాయ‌కు, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని శ్రీ జగన్ దాఖలు చేసిన పిటిష‌న్‌ను కోర్టు సోమవారంనాడు విచారించింది.

కాగా, శ్రీ జగన్ పిటిష‌న్‌పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ‌శ్రీ జగన్ బెయి‌ల్పై ఆంక్షలు సడలించవద్దని కోరారు.‌ శ్రీ జగన్‌ ఆస్తుల కేసులో సాక్షులంతా హైదరాబా‌ద్ వెలుపలే ఉన్నారని, పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున వారిని ప్రభావితం చేయవచ్చనని న్యాయస్థానానికి‌ సిబిఐ తెలిపింది. ఈ కేసులో నిందితులు ఇంకా జైలులోనే ఉన్నారని, వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపింది. బెయి‌ల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంట‌ర్ పిటిష‌న్లో‌ సిబిఐ పేర్కొంది.

సిబిఐ కౌంటర్ పిటిష‌న్పై‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరపు న్యాయవాది సుశీల్ కుమా‌ర్ కోర్టులో వాదనలు వినిపించారు. శ్రీ జగన్పై ఉన్నది హైలీ టెక్నిక‌ల్ కేసు అని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యమూ డాక్యుమెంట్‌గా రికార్డు అయిందన్నారు. ఈ కేసులోని 70 మంది నిందితుల్లో 2౦ మందిని నిర్దోషులని సిబిఐ పేర్కొన్నట్లు వివరించారు. తొమ్మిది కంపెనీల్లో క్విడ్ ప్రో కో లేదని సిబిఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వే‌చ్ఛను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించబోమని సుశీల్ కుమా‌ర్ న్యాయస్థానానికి విన్నవించారు.

‌తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే‌ శ్రీ జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని న్యాయవాది సుశీల్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు. ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇడుపులపాయకు వెళ్లేందుకు‌ శ్రీ జగన్కు‌ కోర్టు అనుమతి ఇచ్చింది.

Back to Top