హైదరాబాద్) ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ను భౌతికంగా హత్య చేసే కుట్ర కు చంద్రబాబు తెగపడుతున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి వస్తోందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అందుకే త్వరలోనే వైయస్సార్సీపీ ఫినిష్ అవుతుందని, ఖాళీ అయిపోతుందని పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని పెంచింది తామేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకోవటాన్ని భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. అటువంటప్పుడు పరివ్రాజకులు, వాగ్గేయకారులు, చక్రవర్తులు, పరమ భక్తులు బాధ పడాల్సిన పరిస్థితి అని ఆయన అభివర్ణించారు. ఇది హిందూ ధార్మికత మీద చావు దెబ్బ కొట్టడం అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.మహానాడు లో వైయస్ జగన్ వ్యక్తిత్వం మీద దాడి చేసే కార్యక్రమం చేపట్టారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. గుండె నిబ్బరత, నిజాయతీ, ఎవరికీ వంచని నైజం వైయస్ జగన్ ది అని, అందుకే అన్ని సార్లు తలచుకొన్నారని వ్యాఖ్యానించారు. మీ అవినీతి మీద, మోసపు నయవంచన మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుకనే వైయస్ జగన్ పట్ల దారుణమైన దాడి చేస్తున్నారని భూమన వివరించారు. అటు ప్రపంచంలో ఆదర్శవంతమైన నాయకుడినని, తాను లేకపోతే ఏపీకి భిక్ష పెట్టే వాళ్లే లేరంటూ మతి మించిన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.