కొవ్వూరు : ముఖ్యమంత్రి స్థానంలో ఉండబట్టి చంద్రబాబు బతికి పోయారని, లేదంటే జైలుకి పంపించి ఉండేవారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అని ఆయన అన్నారు. కొవ్వూరు లో పుష్కర స్నానం ఆచరించి పూజాదికాలు నిర్వహించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వీఐపీలకు కేటాయించిన ఘాట్లలో చంద్రబాబు పూజలు చేసి ఉంటే, ఈ ఘోరం జరిగేది కాదని జగన్ అభిప్రాయ పడ్డారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే వీఐపీ ఘాట్ లు ఏర్పాటు చేశారని, పబ్లిసిటీ కోసమే సామాన్యుల ఘాట్ లో చంద్రబాబు రెండున్నర గంటల పాటు పుష్కర పూజలు నిర్వహించారని ఆయన మండిపడ్డారు. బాబు చేసిన తప్పిదాలకు విచారణ పేరుతో అధికారుల్ని బలి చేయాలని చూస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు సీఎం కాబట్టి తప్పించుకొంటున్నారని, ఇదే స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకి పంపేవారని ఆయన పేర్కొన్నారు.