వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసులు ధ్వజం వనరులు లేవని గతంలో తప్పించుకున్న జేడీ ఇప్పటికైనా ఆ భూములపై సమగ్ర విచారణ చేయాలి లక్ష్మీనారాయణ ద్వంద్వనీతి మళ్ళీ వెల్లడైంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు హైదరాబాద్, 27 ఆగస్టు 2012 : ఐఎంజీ భారత సంస్థకు భూముల కేటాయింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ద్వంద్వనీతి మరోసారి బయటపడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హయాంలో హైదరాబాద్ నడిబొడ్డున నామమాత్రపు ధరకే ఐఎంజీ భారత అనే దిక్కూ దివానం లేని సంస్థకు 850 ఎకరాలు కేటాయించారు. ఈ అవకతవకలపై విచారణ చేయాలని దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి గతంలోనే కోరితే ప్రస్తుత సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ వనరులు లేవంటూ తప్పుకున్నారు.అయితే జగన్మోహన్రెడ్డి విషయంలో మాత్రం కోర్టు ఆదేశాలే ఆలస్యం అన్నట్లుగా 24 గంటల్లో ఇతర రాష్ట్రాల నుంచి 80 బృందాలను రప్పించారు. జగన్ ఇంటిపైన, ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లపైన దాడులతో రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించారు. చంద్రబాబుపై దర్యాప్తు చేయడానికి జేడీ లక్ష్మీనారాయణ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ ద్వంద్వ నీతి ఏంటి? ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందమేంటి?’ అని శ్రీనివాసులు నిలదీశారు. దర్యాప్తు అధికారిలా లక్ష్మీనారాయణ వ్యవహరించడంలేదని, రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ, దాని అధ్యక్షుడు చంద్రబాబుపై లక్ష్మీనారాయణకు ప్రేమ ఉంటే ఆ పార్టీలో చేరాలని సలహా ఇచ్చారు. జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత కక్ష ఉంటే జేడీ పదవికి రాజీనామా చేసి చంద్రబాబుతో కలిసి నేరుగా ఢీకొనాలని అన్నారు. లక్ష్మీనారాయణకు నిజాయితీ ఉంటే ఉద్యోగ బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించాలన్నారు. కోర్టు మొట్టికాయలు వేసినందున ఇప్పటికైనా ఐఎంజీ భారత భూబాగోతంపై సమగ్ర విచారణ చేయాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు.