<strong>–మట్టిని, ఇసుకను కూడా టీడీపీ నేతలు వదలడం లేదు</strong><strong>–ప్రజలపై మీరు చేసిన దాడులను ప్రపంచం చూసింది</strong><strong>– గ్రామ స్థాయిలో జన్మభూమి ముఠాలను ఏర్పాటు చేశారు.</strong><strong>– వైయస్ జగన్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి</strong><strong>–వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్బాబు</strong><br/>హైదరాబాద్: మట్టి, ఇసుక, దేవాదాయ భూములు కొల్లగొడుతున్న టీడీపీ నేతలను దొంగలు అనాలా? నాయకులు అనాలా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్బాబు ప్రశ్నించారు. నాయకుల ముసుగులో దొంగతనాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. బుధవారం హైదరాబాద్లోకి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుధాకర్బాబు మాట్లాడుతూ..టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో అనేక సార్లు దోపిడీ చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. ప్రభుత్వ అధికారులపై, ప్రజలపై బహిరంగంగా టీడీపీ నేతలు చేస్తున్న దాడులు ప్రపంచం అంత చూసిందన్నారు. మీ దురంకారానికి, మీ దోపిడికి అడ్డువచ్చినప్పుడు అధికారి, సామాన్య ప్రజలు అన్న తేడా లేకుండా చెండాటం టీడీపీ నేతలు అలవాటు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో సహజసిద్ధంగా దొరుకుతున్న మట్టి, ఇసుకను దోచుకుంటున్నది ఎవరని నిలదీశారు. టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాంతాల వారిగా విభజించుకొని దోచుకోవడం లేదా అన్నారు. ఈ విధంగా దోచుకునే వారిని దొంగలంటారా? నాయకులంటారా? అని ప్రశ్నించారు. రేషన్కార్డుల మంజూరు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కావాలన్నా గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో దొంగల ముఠాను ఏర్పాటు చేశారన్నారు. ఏ రాజ్యాంగంలో లేని విధంగా ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలకు పెత్తనం అప్పగించారన్నారు. ఒక రోడ్డు నిర్మానం జరగాలంటే ప్రభుత్వం ద్వారా జరగాల్సిన పనిని మీరు 30 శాతం పనులకు అప్పగించి, మిగతా 70 శాతం దోచుకుంటున్నారని ఆరోపించారు.<br/><strong>వైయస్ జగన్ ఆషామాషి నాయకుడు అనుకుంటున్నారా?</strong>టీడీపీ నేతలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అసందర్భానుసారంగా విమర్శలు చేస్తున్నారని సుధాకర్బాబు మండిపడ్డారు. వైయస్ జగన్ ఆషామాషి మనిషి అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. మీ నాయకుడి మాదిరిగా మామ అధికారాన్ని అడ్డదారిలో తీసుకొని గద్దె నెక్కిన లీడర్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మా నాయకుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఎదురించారని గుర్తు చేశారు. 44 శాతం ఓట్లు సాధించిన పార్టీకి అధ్యక్షుడని చెప్పారు. అలాంటి నాయకుడిపై అవాకులు, చవాకులు పేల్చితే జాగ్రత్త అని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. రాయలసీమలో గ్రానైట్, ఇసుకను అప్పనంగా మింగేసి చంపేసింది మీరు కాదా? అన్నారు. కర్నూలు జిల్లాలో మా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణరెడ్డిని పట్టపగలే హత్య చేసింది మీరు కాదా అని నిలదీశారు. అధికార పార్టీ చేసే ప్రతి తప్పును ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షానిదని తెలిపారు. మీకు, మాకు కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉన్న సంగతి మరిచిపోవద్దని సూచించారు. ప్రతిపక్ష నాయకుడిని ఇష్టారాజ్యంగా మాట్లాడుతారా అన్నారు. విశాఖలో మీ మంత్రి గంజాయి వ్యాపారం చేస్తున్నారని మరో మంత్రి విమర్శలు చేసిన ఘనత టీడీపీది అన్నారు. అదే మంత్రి భూములు దోచుకున్నారని, అడ్డగోలుగా వ్యాపారాలు చేస్తున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారని, అలాంటి వారిని దొంగలనాలా? నాయకులనాలా అన్నారు. రాజధాని కోసం వేల ఎకరాల భూములు తీసుకున్నారని, ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించారు. ఇప్పటికే భూములు పంపకాలు చేశారని తప్పుపట్టారు. అమరావతి పేరుతో అమరలింగేశ్వరస్వామి ఆలయ భూములు దోచుకుంది మీరు కాదా అన్నారు. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇవ్వలేదని, మిమ్మల్ని ప్రశ్నించారని రైతుల పంట పొలాలను తగులబెట్టిన చరిత్ర మీది కాదా? ట్రాక్టర్లతో పంట పొలాలు దున్నేశారు. మీరు తీసుకున్న భూములపై చర్చిద్దాం రండి..ఎవరు దొంగలో తేలుతుందన్నారు. అమరావతిలో మీరు చేసే దంద అందరికి తెలుసు. కనకదుర్గమ్మ భూములను దోచుకోవాలని చూసిన మిమ్మల్ని దొంగలనాలా..నాయకులనాలా అని నిలదీశారు. <br/><strong>హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయారు</strong>పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఎందుకు పారిపోయారని సుధాకర్బాబు ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో ఎమ్మెల్సీని కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. హైదరాబాద్ నుంచి ఏడాదిన్నరకే సచివాలయాన్ని ఎందుకు తరలించావని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మీరు లేవనెత్తిన ఏం అంశంపైనేనా మేం చర్చకు సిద్ధమే అని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తవ్విన కాల్వల్లో పట్టిసీమకు నీరు పారించి చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు పారించాల్సిన చోట నిధులు పారించిన చరిత్ర మీది అన్నారు. మీరా మా నాయకుడిని అనేది అని ప్రశ్నించారు.అలాంటి మిమ్మల్ని దొంగలు అనాలా? నాయకులు అనాలా అని సుధాకర్బాబు ప్రశ్నించారు.