ముదిగుబ్బ: తన హైటెక్ పాలనతో తొమ్మిదేళ్లు ప్రజలను దారుణంగా దగా చేసిన చంద్రబాబునాయుడును మరోసారి నమ్మితే నట్టేట ముంచేస్తాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కంచం లీలావతి విమర్శించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులతో కలిసి ఆమె ముదిగుబ్బ మండలం రామస్వామి తండా, పూజారి తండా, పోరడ్లపల్లి, మంగళమడక గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలో ఉండగా ప్రజా వ్యతిరేక పాలనతో అన్ని వర్గాలను సంక్షోభంలోకి నెట్టిన చరిత్ర టీడీపీదేనని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమం గురించి ఏనాడూ ఆలోచించని చంద్రబాబు ఇపుడు మొసలి కన్నీరు కారుస్తూ, ప్రజలను మభ్యపెట్టడానికే వస్తున్నారన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు సినీ దర్శకుల సూచనలతో పాదయాత్ర చేపట్టారని విమర్శించారు. వైయస్ఆర్ సీపీపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు అపారమైన విశ్వాసం చూపుతున్నారనీ, వారి ఆశల మేరకు భవిష్యత్తులో వైయస్ స్వర్ణ యుగాన్ని తీసుకొస్తామనీ చెప్పారు. జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని, పార్టీని ఆశీర్వదించాలని ఆమె కోరారు.