హైదరాబాద్: టెక్నాలజీ పెరిగాక ప్రపంచమే కుగ్రామమయ్యిందని అందరూ అంటారు కానీ హైటెక్ బాబు మాత్రం ఒప్పుకోరు. హెలికాఫ్టర్ రెక్కలు, విమానం తోక పట్టుకుని బాబు చేసే ప్రయాణాలు వీడియో తీస్తే, ఆయన గురించి తెలియని వారు మొదట గ్రాఫిక్స్ అనుకుంటారు. తరువాత స్లోమోషన్లో ప్లే చేసుకుని చూస్తే నిజమని ఒప్పుకుంటారు. అనంతపురంలో కరువు రాక్షసితో రెయిన్గన్లతో యుద్ధం చేసి కరువు భయపడి పారిపోయిందని ప్రెస్సుకు చెప్పి, వెంటనే విజయవాడలో మస్కిటో బ్యాట్ పట్టుకుని దోమలపై దండయాత్ర చేసి దోమల జాతి నశించిందని ప్రెస్సుకు చూపించి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ముందు బ్యాట్తో విన్యాసాలు చేస్తారు. చెంబుడు నీళ్లు బక్కెట్లలో పోసి అనుసంధానం పండుగ చేస్తారు. వీడియో కాన్ఫరెన్సు, టీవీ కాన్ఫరెన్సులకు బాబు పెట్టింది పేరు. కాన్ఫరెన్సుల్లో కొన్ని లెక్కల కాగితాలు ముందు పెట్టుకొని మైకు ముందు మైకంతో ఆయన మొదలు పెడితే ఎప్పుడు ఆపుతారో ఆయనకే తెలీదు. ఎలా అపాలో ఎవరికీ తెలీదు. కొత్తగా బాబు పాస్వర్డ్ జియోట్యాగ్. జిందాతిలిస్మాత్ కంటే జియోట్యాగ్ పవర్ఫుల్ అని బాబు నమ్మకం. అన్ని అమ్మకాల్లో ఒక జియోట్యాగేనట. దోమలపై దండయాత్ర పేరెవరు పెట్టారో కానీ, పిచుక మీద బ్రహ్మస్త్రం వేసినట్లు గొప్ప పేరు పెట్టారు. రేపు ఈగలపై జైత్రయాత్ర, చీమలపై శంఖారావం అని పెట్టాక అతిపెద్ద సామాజిక సమస్యలపై పోరాటాలకు తాటాకు చప్పుళ్లు, తమలపాకు దెబ్బలాంటి పేర్లు పెడతారేమో! హెలీకాఫ్టర్, ఛార్టర్డ్ విమానాలు అలసిపోయేలా తిరిగినా దేవతల రాజధాని, రేపు 2050 నాటికి ప్రపంచ గొప్ప నగరాల్లో మొదట నిలబడబోయే అమరావతి... తాత్కాలిక గుడారాల్లోకి రాగానే బాబుకు వీడియో కాన్ఫరెన్స్ పెట్టేయాలనిపిస్తుంది. మీడియా స్పేస్ ఆక్రమించడానికి, యంత్రాంగాన్ని వేలుపట్టి నడిపిస్తున్నట్లు మార్కులు కొట్టేయడానికి 24 గంటల్లో 48 కాన్ఫరెన్సులయినా బాబు పెట్టగలరని ఆయన తడాఖా తెలిసిన వారు, దగ్గర నుండి చూసిన వారు కథలు కథలుగా చెప్పుకుంటారు. అనగనగ నాయనా పులివచ్చే అన్న కథ తెలుగు నేల మీద బాగా పరిచయం. బాబు అరగంటకొక కాన్ఫరెన్సు పెడుతుండడంతో అధికారులు లైట్ తీసుకున్నారు. మొన్నామధ్య బాబు టెలీ కాన్ఫరెన్సులోనే ఆవేశపడిపోయారు. ముఖ్యమంత్రిగా ఉంటూ నేనే అమరావతిలో దోమలు, చీమకుర్తిలో చీమలు, ఇచ్చోడలో ఈగలు ఎన్ని ఉన్నాయో చెప్పగలుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్నారు. తీరా సీఎం టెలీకాన్ఫరెన్సులో అధికారుల హాజరు పలుచగా ఉందని తెలిసి బాబు చాలా కోప్పడ్డారు. కాన్ఫరెన్స్ చివర వారంతా వచ్చి ఈగలు తోలడానికే అధికారికంగా వెళ్లామని చెబుదామనుకున్నారు. కానీ అప్పటికే కనెక్షన్ కట్ చేసి బాబు మనవడిని తీసుకుని రెయిన్గన్తో ఆడుకోవడానికి వెళ్లిపోయారు. మరుసటి రోజు మిత్ర పత్రికల్లో రంగు రంగుల వార్తలు, ఫోటోలు, వింత వింత క్యాప్షన్స్. మన సీఎం రెయిన్మనవడు గన్. మనవడితో ఆడుకోవడానికి టైమ్ లేక కన్నీరు కార్చిన సీఎం, ఆ నీటిని కాలువలకు మళ్లించిన మనవడు. అరవైదాటినా ఆగని ఆరాటం, నెలలు దాటకపోయినా నింగికెగురుతున్న కెరటం. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటి కాయంత అని వెనకటికి ఒక సామెత. ఒక పక్క టెక్నాలజీ పెరిగి దూరాలు, ప్రయాణాలు తగ్గిన వేళ ప్రయాణాలు, ప్రత్యేక హెలిక్యాప్టర్, విమానాల మీద బాబు ఖర్చు చూసి ఢిల్లీలో ఒక పెద్దాయన ప్రధానమంత్రి కంటే సీఎం ప్రయాణం ఖర్చే తల తిరిగేలా ఉందన్నాడట. అది తెలిసే కాబోలు– మోడీ డబ్బులు ఇవ్వకుండా నీళ్లు మట్టి ఇచ్చినట్లున్నారు.