అనంతపురం: వైయస్ఆర్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలకు పెద్దపీట వేశారని వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో వైయస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో ఆత్మీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని పేర్కొన్నారు. కుటుంబం నుంచి దేశ స్థాయి వరకు మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని, రానున్న రోజుల్లో రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యత పెరుగుతుందని తెలిపారు. 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తే శాసనసభ, పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశారని, సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు అనేక అవకాశాలు కల్పించారని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయని, రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. సోషల్ మీడియాను బలమైన ఆయుధంగా ఉపయోగించుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు సూచించారు. గత ఐదేళ్ల వైయస్ఆర్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంలో లోపం జరిగిందని, ఇకపై పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ బలాన్ని చాటాలని, ఓటర్ల జాబితాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి వైఎస్ జగన్ను అధికారంలోకి తీసుకురావడానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు. మహిళలు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని నాయకులు పునరుద్ఘాటించారు.