ప్రజాస్వామ్యం అంటే ఇదేనా?

బ‌లం లేకపోయినా బలవంతంగా పదవులను లాక్కుంటున్నారు

 వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఫైర్‌

తాడేపల్లి: కూటమి నేతలు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా ఖూనీ చేశారని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు,మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికల్లో బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నార‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లపై కేసులు పెట్టి బెదిరించారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అని సుధాక‌ర్‌బాబు ప్రశ్నించారు.  తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఉప ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు రెచ్చిపోయారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. బలం లేకపోయినా బలవంతంగా మున్సిపల్ పదవులను లాక్కుంటున్నారు. పిడుగురాళ్లలో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అరాచకం చేశారు. మా పార్టీ కౌన్సిలర్లపై కేసులు పెట్టించి బెదిరించారు. కిడ్నాప్ చేసి తమవైపు లాక్కున్నారు. మున్సిపాలిటీల్లో చైర్మన్‌ పదవులన్నీ వైయ‌స్ఆర్‌సీపీ నేతలే గెలిచారు. ఇప్పుడు ప్రత్యేకంగా వైఎస్‌ చైర్మన్‌గా టీడీపీ వారు ఉండటం వల్ల వారికి వచ్చే లాభమేంటి?.

భ‌విష్య‌త్‌లో ఇదే రిపీట్‌ అవుతుంది
`అధికారం ఉందనే అహంకారంతో పదవులను కైవసం చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి నేతలు నేర్పుతున్న పాఠాలు భవిష్యత్తులో అన్ని పార్టీలు అవలంభిస్తాయి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే?. నెల్లూరులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పోలీసులను అడ్డు పెట్టుకుని డిప్యూటీ మేయర్‌ను గెలిచారు. అసలు ఒక్క కౌన్సిలర్‌ని కూడా గెలవలేని టీడీపీ.. ఇప్పుడు వైస్ చైర్మన్‌లను గెలవాలని చూస్తోంది. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీ మారింది. దొడ్డిదారిలో పదవులు పొందటం ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది?. ఇలా పదవులు పొందటం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి వారికి ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారు’ అని ఘాటు విమర్శలు చేశారు. 

Back to Top