తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక.. తప్పుడు వార్తలు, విశ్లేషణలతో వ్యక్తిత్వ హననం చేయడమే కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని.. కానీ వారి ఏడుపులే వైయస్ జగన్కి ప్రజా దీవెనులుగా మారుతున్నాయని గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను గౌరవించి హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరుకాబోతూ అందుకు షెడ్యూల్ని విడుదల చేస్తే కోర్టుకే జగన్ టైమిచ్చారంటూ, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడిగా నిబంధనల ప్రకారం ఆయన ఎక్కడికెళ్లినా షెడ్యూల్ విడుదల చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఎల్లో మీడియా, కూటమి నాయకులు ఎంత దుష్ప్రచారం చేసినా ఆయనపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని అణువంత కూడా తగ్గించలేరని బదులిచ్చారు. చంద్రబాబుకి చేతనైతే ఎన్నికల వాగ్ధానాలను అమలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. సొంత డబ్బుతో అద్దెకు తెచ్చుకున్న ఫ్లైట్లో వైయస్ జగన్ కోర్టుకి వెళితేనే బురదజల్లిన ఎల్లో మీడియాకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ప్రజల సొమ్ముతో వారం వారం స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి వెళ్తుంటే కనిపించలేదా అని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... ● వైయస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్న ఒకే ఒక్క మాట ఇంత చెత్త ప్రభుత్వం, ఇంత దుష్టప్రభుత్వం దేశంలోనే లేదని. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రలు, రాజ్యాంగ పరిరక్షణ.. వీటిలో ఏదీ లేదని ప్రతిఒక్కరూ చెబుతున్న మాట. 2019-24 మధ్య వైయస్ఆర్సీపీ హయాంలో వైయస్ జగన్ పాలనను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న తీరును చంద్రబాబు పాలనతో పోల్చిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ కు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న మంచిపేరును, పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎలాగైనా అడ్డుకోవాలనే కుట్రతో అనుక్షణం తప్పుడు ఆరోపణలు, వైయస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారు. ● కోర్టు ఆదేశాలను గౌరవించి హాజరైతే... మాజీ సీఎం వైయస్ జగన్ లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకునే సదర్భంగా పర్యటన అనంతరం కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆ మేరకు తాడేపల్లి నుంచి బయల్దేరి గురువారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు. జడ్జి ముందు హాజరైన అనంతరం లోటస్పాండ్కి వెళ్లి అక్కడ్నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. వైయస్ జగన్ మీద బురదజల్లి వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్న కూటమి నాయకులు.. కోర్టు ఆదేశాలను గౌరవించి వైయస్ జగన్ కోర్టుకు హాజరైతే కూడా ఓర్వలేకపోయారు. టీడీపీ అనుకూల మీడియాలో వరుస పెట్టి తప్పుడు కథనాలతో ప్రజల్లో వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని చులకన చేసే ప్రయత్నం చేశారు. అక్రమ ఆస్తుల కేసల్లో నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న జగన్, జగన్ ప్లాన్ ప్రకారమే వైయస్ఆర్సీపీ శ్రేణుల అరాచకం, కోర్టుకు హాజరయ్యేటప్పుడు ఈ బల ప్రదర్శన ఏమిటి? బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు టీవీ5, ఈటీవీ, ఏబీఎన్ ఛానెళ్లకు వేరే పనేమీ లేకుండా వైయస్ జగన్ మీద విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. కోర్టుకు హాజరయ్యేందుకు లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్లో వచ్చిన జగన్, ఫ్లైట్కి గంటకు రూ.8 లక్షలు, గన్నవరం నుంచి హైదరాబాద్కి ఇదే ఫ్లైట్లో వచ్చిన జగన్, హైదరాబాద్ నుంచి బెంగళూర్కి చార్టెడ్ ప్లైట్.. తన సొంత డబ్బుతో వైయస్ జగన్ హైదరాబాద్ వెళితే తప్పన్నట్టు చిత్రీకరిస్తున్నట్టు ఎల్లో మీడియా.., చంద్రబాబు, పవన్ కళ్యాన్, నారా లోకేశ్ లు ప్రజల సొమ్ముతో వారం వారం హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తుంటే మాత్రం కనీసం ఎక్కడా వార్త కూడా ఉండదు. సంపద సృష్టిస్తామని చెప్పిన ఈ నాయకులు జనం సొమ్ముతో జల్సాలు చేస్తూ ప్రత్యేక విమానాల్లో సొంత కార్యక్రమాలకు తిరుగుతుంటే కనిపించడం లేదు. ● ఎల్లో మీడియా ప్రచారంతోనే భారీగా వచ్చారు ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కుతున్న జగన్, జగన్ పర్యటనపై సోషల్ మీడియాలో జగన్పై సెటైర్లు.. పర్యటన షెడ్యూల్ చూపించి కోర్టుకి జగన్ అరగంట టైమిచ్చాడు.. అని ప్రచారం చేశారు. కోర్టుకు టైమివ్వడం అనేది ఎవరూ చేయని పని. పరిస్ధితినిబట్టి రోజంతా ఉండాల్సి రావచ్చు. ఈరోజు 5 నిమిషాల్లోనే కోర్టుముందు హాజరై తిరిగి వచ్చేశారు. వైయస్ జగన్ నాంపల్లి కోర్టుకు వస్తున్నారని ఈనాడు, ఆంధ్రజ్యోతిలే ఎక్కువగా ప్రచారం చేశాయి. ఆ విషయం తెలుసుకున్న జగన్ అభిమానులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చారు. హైదరాబాద్లో మా పార్టీ లేకపోయినా, వైయస్ జగన్ కోసం వచ్చిన అభిమానాన్ని చూసి కూటమి నాయకులకు కళ్లు బైర్లు కమ్మాయి. కడుపుమంటతో మా నాయకుడి మీద బురదజల్లడానికి ఏం చేయాలో తెలియక స్పెషల్ ప్లైట్ అంటూ హడావుడి మొదలుపెట్టాయి. రాష్ట్రం వెలుపల కూడా ఆయనకు ప్రజల్లో వస్తున్న అభిమానం కూటమి నాయకులకు నిద్రలు లేకుండా చేస్తోంది. ఎలాంటి జనసమీకరణ చేయకపోయినా, పర్యటన పేరుతో రావాలని పార్టీ పిలుపివ్వకపోయినా ఆయన కోసం వేలల్లో అభిమానులు తరలివచ్చారు. గడిచిన ఐదేళ్ల పాలన, అంతకుముందు, ఇప్పుడూ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేస్తున్న పోరాటాలు, ఆయన నిజాయితీ, వైయస్సార్ బిడ్డగా.. ఆయనకు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే ఆయన ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక నాయకుడిగా పరిపూర్ణమైన వ్యక్తికి దక్కుతున్న గౌరవం అది. ఎల్లో మీడియా ఎంత విష ప్రచారం చేస్తే అంత ఎక్కువగా ఆయనకు ప్రజల్లో అంత ఎక్కువగా అభిమానం పెరిగిపోతుంది. ఆఖరుకి విజయవాడలో కొంతమంది మావోయిస్టులను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుంటే దాన్ని కూడా తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారానికి వాడుకోవాలని చూసింది. చంద్రబాబు సీఎంగా ఉండగా.. చంద్రబాబు మీద ఎటాక్ చేయడానికే వారిని వైయస్ జగన్ వారిని పిలిపించినట్టు సిగ్గులేకుండా విషం చిమ్ముతున్నారంటే వీరిని ఏమనాలో అర్థం కావడం లేదు. ● కూటమి పాలనకు ఏడాదిన్నరలోనే ఆఖరి రోజులొచ్చాయి కాంగ్రెస్ పార్టీతో లాలూచీపడి చంద్రబాబే తమ పార్టీకి చెందిన అశోక్ గజపతిరాజు, ఎర్రన్నాయుడులతో వైయస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించాడు. అయినా వైయస్ జగన్ ఎక్కడా భయపడింది లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీదనే పోరాడి భారీ ప్రజాదరణతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఆయన నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళ్లిపోయారు. వైయస్ జగన్ మీద కూటమి నాయకులు చేసే తప్పుడు ప్రచారాలన్నీ ఆయనకు ఆశీస్సులు అవుతాయే కానీ, ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని అణువంత కూడా తగ్గించలేరు. కూటమి ఏడుపులే ఆయనకు దీవెనలుగా మారుతున్నాయి. చేతనైతే ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసి ఆయన కన్నా గొప్పగా పాలన చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని దించేసే సమయం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. 18 నెలల్లోనే కూటమి ప్రభుత్వానికి నూరేళ్లు నిండిపోయాయి.