చీపురుపల్లి: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తదితర విద్యార్థి, యువత సమస్యలపై వైయస్ఆర్సీపీ నిరంతరం పోరాటం చేస్తుందని యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష స్పష్టం చేశారు. వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సూచనల మేరకు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో రేపు విజయనగరం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వైయస్ఆర్సీపీ విద్యార్థి–యువత నిరసన ర్యాలీ పోస్టర్ను గరివిడి క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, డాక్టర్ బొత్స అనూష ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనూష మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలతో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలు, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడం సహా విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. విద్యార్థులు, యువతకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్సీపీ తరఫున పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపు విజయనగరంలోని న్యూ పూర్ణ థియేటర్ నుంచి మూడు లాంతర్ల వరకు నిర్వహించనున్న నిరసన ర్యాలీకి విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కేవీ సూర్యనారాయణ (పులిరాజు), చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.