పశ్చిమ గోదావరి: ఉండి మాజీ శాసనసభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ఆదర్శమూర్తి అని ఉమ్మడి గోదావరి జిల్లాల వైయస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, లోక్ సభ సభ్యులు, లోక్ సభ పక్షనేత మిధున్ రెడ్డి కొనియాడారు. ఈ నెల 18న గుండెపోటుతో మరణించిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు సంతాప సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్రాజు చిత్రపటానికి మిథున్రెడ్డి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీరంగనాథరాజు, తదితరులు నివాళులర్పించారు. ఈ క్రమంలోనే పాతపటి సర్రాజు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. పాతపాటి సర్రాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన సర్రాజు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు.