ముగిసిన తొలిరోజు ప్లీన‌రీ సమావేశాలు

గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని  విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వ‌హించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ స‌మావేశాలు మొద‌టి రోజు దిగ్విజ‌యంగా ముగిశాయి. ముందుగా పార్టీ జెండాను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్క‌రించి ప్లీన‌రీ స‌మావేశాల‌ను ప్రారంభించారు. ప్లీనరీ వేదికపై దివంగత మహానేత వైయ‌స్సార్‌ విగ్రహానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ నివాళులర్పించారు. ప్లీనరీ సమావేశాలకు వైయ‌స్‌ విజయమ్మ హాజరయ్యారు. పండగలా వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీ జరుగుతోంది. తొలిరోజు ప్లీనరీలో నాలుగు తీర్మానాలు చేశారు. మహిళా సాధికారత-దిశ చట్టంపై తీర్మానం, విద్యా రంగంలో సంస్కరణలపై రెండో తీర్మానం, నవరత్నాలు-డీబీటీ(డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌)పై మూడో తీర్మానం,  వైద్యారోగ్య రంగంపై నాలుగో తీర్మానం చేశారు. 

అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప్లీనరీకి ల‌క్ష‌లాదిగా పార్టీ శ్రేణులు త‌ర‌లివ‌చ్చారు.  పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు పేరునా లేఖ రాసి ఆహ్వానించడంతో పార్టీ వార్డు సభ్యులు మొదలు ప్రజాప్రతినిధుల వరకు అందరూ తొలి రోజున ప్రతినిధుల సభకు కదలి వ‌చ్చారు. రెండో రోజున విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రం నలు మూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో.. వర్షం వచ్చినా ప్లీనరీకి హాజరయ్యే వారు తడవకుండా భారీ విస్తీర్ణంలో వాటర్‌ప్రూఫ్‌ టెంట్లు ఏర్పాటు చేశారు.

Back to Top