తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాజకీయ చరిత్రపై అవగాహన లేకనో, తెలుగుదేశం ‘సీనియర్ నేతల’ ప్రాంప్టింగ్ లో లోపాల వల్లనో గాని ఈ పార్టీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ ఈమధ్య మాట్లాడేవన్నీ తప్పుల తడకలే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పాలకపక్షం అధినేతపై అభాండాలు వేయడానికి లోకేష్ కావాలని అవాస్తవాలు చెబుతున్నాడన్నారు. తండ్రి ఎన్.చంద్రబాబు నాయుడు ‘ప్లానింగ్’ పుణ్యమా అని అమెరికాలో బీఎస్, ఎంబీఏ చదివిన నారా లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానం బొత్తిగా లేదని, రాజకీయ ప్రత్యర్ధులపై అడ్డగోలు నిందలేయడం తప్ప ఏదీ రాదని పదే పదే రుజువవుతోందన్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డి ఓ స్టోరీని విడుదల చేశారు. ``తాజాగా తన ‘సొంత’ నియోజకవర్గం మంగళగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఈ ‘నిరంతర విద్యార్థి’ చేసిన ఆరోపణ దీనికి చక్కటి ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీకి ఏపీ సీఎం గతంలో ఎప్పుడో వెన్నుపోటు పొడిచారని లోకజ్ఞానం తెలియని లోకయ్య నాయుడు నోరు పారేసుకున్నాడు. అయితే, తాను సభ్యుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఒంటెత్తు పోకడలతో తనపై కక్షసాధింపులకు పాల్పడిన కారణంగా 2011లో ఈ పార్టీ నుంచి ఏపీ ప్రస్తుత సీఎం వైదొలిగారు. అంతేగాదు, ఈ పార్టీ టికెట్ పై తనకు దక్కిన పార్లమెంటు సభ్యత్వానికి కూడా అదే రోజు రాజీనామా చేశారు. పార్టీపై తిరుగుబాటుగాని, అందులో సంక్షోభం సృష్టించడం గాని చేయలేదు. లోకేష్ తండ్రి చంద్రబాబు తనకు ఆశ్రయం ఇచ్చిన రెండో రాజకీయపక్షమైన తెలుగుదేశం అధ్యక్షుడు, స్థాపకుడు, ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుకు 1995 ఆగస్టులో వెన్నుపోటు పొడిచారు. మామ ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీని కబ్జా చేసి సొంతం చేసుకున్నారు. కోస్తా జిల్లాల యాసలో చెప్పాలంటే చంద్రబాబు టీడీపీని ఎన్టీఆర్ నుంచి గుంజుకుని వాల్చేసుకున్నారు. ఈ రాజకీయ దురాక్రమణతో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నారు. రాజకీయ అవకాశవాదిగా అద్వితీయ నైపుణ్యం ప్రదర్శించిన చంద్రబాబు 1983లో తనను ఓడించిన టీడీపీలో ఎప్పుడు చేరినదీ ఎన్నడూ చెప్పరు. కాని, 1985 అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో తెలుగుదేశంను నెమ్మదిగా జేబులో కుక్కుకోగలిగారు. మరి ఏపీ సీఎం వైయస్ జగన్ తనతో దుర్మార్గంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీతో స్వచ్ఛందంగా తెగతెంపులు చేసుకున్నారు. వెంటనే సొంత రాజకీయమార్గాన్ని ఎంచుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కొడుకు లోకేష్ కు రాష్ట్ర రాజకీయ చరిత్రపై మంచి అవగాహన కలిగించడానికి ఒక ‘పాలిటిక్స్ ప్రైవేటు మేస్టారు’ కోసం చంద్రబాబు వెదకడం మంచిది. చారిత్రక వాస్తవాలతో రాజకీయ పాఠాలు ఇప్పుడు చెప్పించకపోతే చినబాబు ‘శాశ్వత జూనియర్’ గా మిగిలిపోతాడు. ఈ రాజకీయ మొద్దబ్బాయికి రెండు నెలల్లో 40 ఏళ్లు నిండుతాయి. ఈ దశలో చరిత్ర తెలుసుకోవడం అతనికెంతో అవసరం. లేకుంటే, జనంలో పలచనైపోతాడు. ఎన్నటికీ ‘ఓల్డ్ బాయ్’ గానే నిలిచిపోతాడు`` అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.