అమరావతిలో అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలి

లోక్‌సభలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దేశంలో అతిపెద్ద కుంభకోణం

ఎఫ్‌ఐఆర్‌ను రహస్యంగా ఉంచాలని, మీడియా, సోషల్‌ మీడియాలో రాయొద్దని హైకోర్టు ఆదేశించింది

మాజీ ఏజీ, ఓ న్యాయమూర్తి కుటుంబీకులు ఉండటం వల్లే ఈ ఆదేశాలు

దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఒకే న్యాయం ఉండాలి

ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంలోనూ సీబీఐతో దర్యాప్తు చేయించాలి

న్యూఢిల్లీ: అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. రాజధాని భూకుంభకోణం అంశాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో లేవనెత్తారు. ఏపీ రాజధాని ఏర్పాటు సమయంలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణంలో భాగంగా 4 వేల ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. 

లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి ఏం మాట్లాడారంటే.. ‘‘వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కుట్రతో లక్షల రూపాయలకే చేజిక్కించుకున్నారు. ముందు చంద్రబాబు కృష్ణా జిల్లా తిరువూరులో రాజధాని అన్నారు. ఉద్దేశపూర్వకంగా అందరినీ తప్పుదోవ పట్టించి భూములు కొన్నారు. తెల్లరేషన్‌ కార్డులున్న తమ బినామీలతో భూములు కొనిపించారు. ఈ రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. దీనిపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. నిష్పాక్షిక విచారణ జరగాలనుకుంటున్నాం కాబట్టే రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. 

రాజధాని భూకుంభకోణం కేసు ఎఫ్‌ఐఆర్‌ను రహస్యంగా ఉంచాలంటూ హైకోర్టు ఆదేశించింది. మీడియా, సోషల్‌ మీడియాలో ఎఫ్‌ఐఆర్‌ గురించి రాయొద్దంటూ చెప్పింది. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ ఉండడంతో పాటు ఒక న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు ఉండడం వల్లే ఈ ఆదేశాలు. ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఒకే న్యాయం ఉండాలి. ఇదే తరహాలో ఏపీలో ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణం జరిగింది. రూ.2 వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఆధారాలున్నాయి. ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణంలోనూ సీబీఐతో దర్యాప్తు చేయించాలి’’ అని ఎంపీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 
 

Back to Top