బడుగు, బలహీన వర్గాల ధైర్యం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

బీసీలంతా వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే..

చేతల్లో సామాజిక న్యాయం అమలు చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి జగనన్న

పెత్తందారీవ్యవస్థ ప్రతినిధిగా చంద్రబాబు

చంద్ర‌బాబు దృష్టిలో ఫండ్ ఇచ్చే వాళ్ళే బీసీలు

బడుగు, బలహీనవర్గాల గురించి ఏరోజైనా ఆలోచించావా బాబూ..?

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్‌

తాడేప‌ల్లి: సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని,  శాసనమండలి స్థానాలలో బడుగు బలహీనవర్గాల అభ్యర్థులకు ప్రాధాన్యతనివ్వడం గొప్ప వరంగా భావిస్తున్నామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్ అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ‘నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ’ అనేది నినాదం కాదని.. అది వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమని తేటతెల్లమైంద‌న్నారు. బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులుగా తామంతా ఒకటే అనుకుంటున్నామ‌ని, ఇన్నాళ్లూ రాజ్యాధికార సాధనకు నానాపాట్లు పడే త‌మ‌కు వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఒక భరోసా దొరికింద‌న్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు జగనన్న రూపంలో త‌మ‌కో ధైర్యం కనిపించిందన్నారు. అణగారినవర్గాల ఆశాజ్యోతిగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎంపీ మార్గాని భ‌ర‌త్ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్ ఇంకా ఏం మాట్లాడారంటే.. 
మాటలు కాదు..  చేతల ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమ సొంత మనిషిగా అక్కున జేర్చుకుంటు న్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసు కాదని.. బ్యాక్‌బోన్‌క్లాసుగా గుర్తించిన జగనన్న మనస్తత్వాన్ని అందరూ అర్ధం చేసుకున్నారు. ఇలాంటి మంచి ఆలోచనలు గల ముఖ్యమంత్రి నాయకత్వాన ఎన్నాళ్లైనా పనిచేస్తామని అన్నివర్గాల నేతలు కోరుకుంటున్నారు. మరి, ఇలాంటి ఆలోచనలు సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబుకు ఎందుకు రాలేదని వారంతా ప్రశ్నిస్తున్నారు. చట్టసభలకు ఎవరినైనా పంపాలనుకున్నప్పుడు మునుపెన్నడైనా ఇలాంటి నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నాడా..?  2014–2019లో చంద్రబాబుకు ఇదే అవకాశం వచ్చినప్పుడు ఆయన అగ్రవర్ణాలకే ఎందుకు పట్టం కట్టాల్సి వచ్చింది..? రాష్ట్రంలో  80శాతం జనాభా ఉన్న మా బీసీ, ఎస్సీ, ఎస్టీ  వర్గాలకు కేవలం 30శాతం మాత్రమే పదవులివ్వడంలో చంద్రబాబు ఆలోచనేంటనేది అందరూ గుర్తెరగాలి. మరి, ఈరోజున ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అదే అణగారిన, బలహీనవర్గాల వారికి అన్నింటా 70 శాతానికి పైగా పదవులు కట్టబెట్టారు. దీన్నిబట్టి ఆ ఇద్దరి నాయకుల ఆలోచనా సరళిని మేధావులు విశ్లేషించి ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెబితే బాగుంటుంది. 

ఫండ్ ఇచ్చిన వాళ్ళే బాబు దృష్టిలో బీసీలు
చంద్రబాబు హయాంలో రాజ్యసభ సీట్లంటే.. డబ్బున్న వాళ్లు, పారిశ్రామికవేత్తలే గుర్తుకొస్తారు. ఒక సుజనాచౌదరి, ఒక  సీఎం రమేశ్, ఒక కనకమేడల.. ఇలాంటి వారుంటారు. అదే మా జగనన్న మాత్రం అతిసామాన్యులైన బీసీ నేతలను రాజ్యసభకు పంపిన సంగతిని అందరూ గమనించాలి. సామాజిక ఉద్యమకారుడు ఆర్‌. కృష్ణయ్యతో పాటు కోస్తాప్రాంతం నుంచి నన్ను, రాయలసీమ నుంచి గోరంట్ల మాధవ్‌ను ఇలా మమ్మల్ని రాజ్యసభకు పంపి మా బీసీల ఆత్మగౌరవాన్ని జగనన్న నిలిపారు. దీన్నిబట్టి చంద్రబాబు మనస్తత్వం తెలిసిపోతుంది. పార్టీ ఫండ్‌ ఇచ్చినవాళ్లే నా మనుషులు అనే చంద్రబాబు భావజాలాన్ని అందరూ గమనించాలి. 

టీడీపీ హయాంలో బీసీలు ఎదగలేదు.. 
ఆదినుంచీ బీసీలు మా పార్టీతోనే ఉన్నారంటూ .. బీసీలతో టీడీపీ పల్లకీలు మోయించుకుంది. రాజ్యాధికారానికి వచ్చేసరికి బీసీలంటే మా అగ్రవర్ణాల కు వెన్నుదన్నుగా నిలిచే సెకండ్‌ కేడర్‌ అంటూ పక్కనబెట్టింది. ఫలితంగా  అనాదిగా బీసీలను రాజ్యాధికారానికి దూరంగా పెట్టేందుకు టీడీపీ వ్యూహాత్మక వైఖరి అవలంభించింది. ఇది చంద్రబాబు కుటిల రాజకీయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పెత్తందారీ, జమీందారీ పోకడలను చూసి చూసి భరించలేక, ఓర్చుకోలేక ... బీసీలంతా ముకుమ్మడి నిర్ణయంతో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం ఎదురుచూసినప్పుడు.. వైయ‌స్‌ఆర్‌సీపీ అండగా నిలిచింది. మాట తప్పని, మడమ తప్పని నాయకుడుగా ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను అక్కున జేర్చుకుని అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టినందున ఈరోజు బీసీలంతా వైయ‌స్‌ఆర్‌సీపీ వెంటే ఉన్నారు. ఈక్రమంలోనే ఇటీవల జయహో బీసీ మహాసభ విజయవంతమైంది. 

‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ పేటెంట్ వైయ‌స్‌ఆర్‌సీపీదే..
ఇన్నాళ్లూ రాజకీయాల్లో పెత్తందార్లకు జిందాబాద్‌లు కొడుతూ వారినే నాయకులుగా తయారు చేసి కార్యకర్తలుగానే మిగిలిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఈరోజు వైయ‌స్‌ఆర్‌సీపీ అక్కున జేర్చుకుంది. వారికి పనుల్లో, పదవుల్లో అగ్రభాగం అవకాశాలు కల్పిస్తూ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అనేది నినాదంగా కాకుండా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విధానంగా అమలు చేస్తున్నారు. దీన్నిబట్టి ఆయన ఆలోచనా విధానాన్ని అన్నివర్గాలు అర్ధం చేసుకున్నాయి. నిజంగా, ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీకి పేటెంట్‌ హక్కు ఒక్క వైయ‌స్‌ఆర్‌సీపీకే ఉందని వారంతా ఘంటాపథంగా చెబుతున్నారు. 

నోరు అదుపులో పెట్టుకో లోకేశ్‌ ..
వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని లోకేశ్‌ను రాజకీయ నిరుద్యోగిగా చంద్రబాబు గుర్తించి.. ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టాడు. అలాంటి లోకేశ్‌ .. ఈరోజు పాదయాత్రతో  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ‘లోకేశ్‌.. వెన్నుపోటు పొడిచి కుర్చీలు లాక్కునే సంస్కృతితో రాజకీయాలు మానుకోండి. నీ తండ్రిని ఇప్పటికైనా కళ్లు తెరవమను..’ ఇంకోసారి పాదయాత్ర పేరిట ముఖ్యమంత్రిని ఏమైనా తూలనాడితే.. ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరిస్తున్నాను. 

Back to Top