వెలగపూడి: గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా శాసనసభలో ప్రతి సభ్యుడిని గౌరవించి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్నదొర స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి సభ నుంచి ఎందుకు వెళ్లిపోయిందో మీకు స్పష్టంగా తెలుసు... అలాంటి పరిణామాలు సభకు రాకుండా చూడాలని స్పీకర్ను విన్నవించారు. శాసనసభలో ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ.. చట్టసభలో చర్చ అనేది జరిగి ప్రజా సమస్యలు పరిష్కారం అయితేనే సభ పట్ల ప్రజల్లో కూడా గౌరవం పెరుగుతుందన్నారు. స్పీకర్గా చట్ట సభను బాగా నడిపిస్తారని ఆకాంక్షిస్తున్నా అన్నారు. చట్టాలు, రాజ్యాంగం గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి మీ పేరు ప్రతిపాదించారన్నారు. వెనుకబడిన విజయనగరం జిల్లా గిరిజన ప్రాంతం నుంచి వచ్చాను. మా ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలు అభివృద్ధి పనులు జరగలేదని, దళిత, గిరిజన నియోజకవర్గాల నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇచ్చి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని స్పీకర్ను కోరారు.