ప్రజల పక్షాన నిలబడతారా..? బాబు ఏజెంట్లుగా మిగిలిపోతారా..?

మేధావులని చెప్పుకునే రాజకీయ పక్షాలు తేల్చుకోవాలి

ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు తిరుపతి రంగస్థలంగా మారింది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: దశాబ్దాలుగా వెనుకబాటుకు గురవుతున్న రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే మంచి తలంపుతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని తిరుపతి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలతో పాటు రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా, రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు ఈనెల 29న తిరుపతిలో ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నామని తెలిపారు. 

తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కర్నూలులో న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తూ, విశాఖ పరిపాలన రాజధానిగా, అమరావతిలో శాసన రాజధానిగా కొనసాగించాలని సీఎం వైయస్‌ జగన్‌ గొప్ప విప్లవాత్మక ఆలోచన చేసిన వెంటనే.. ఈ రాష్ట్రంలోని ప్రతీఘాతక శక్తులన్నీ ఒక్కటయ్యాయన్నారు. ప్రతిపక్షాలన్నీ ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే భూమన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధిని కుళ్లపొడిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

రాయలసీమ ప్రజల గుండె చప్పుడు, జరుగుతున్న అన్యాయాన్ని, జరగాల్సిన న్యాయాన్ని గొంతెత్తి నినదించడానికి ఆత్మగౌరవ మహా ప్రదర్శనకు తిరుపతి రంగస్థలంగా మారిందని చెప్పారు. అన్యాయమైన ప్రజల పక్షాన నిలబడతారా..? లేక 29గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొద్దిమంది ధనిక భూస్వాములకు, టీడీపీ, చంద్రబాబుకు ఏజెంట్లుగా మిగులుతారా తేల్చుకోవాలని మేధావులని చెప్పుకునే రాజకీయ పక్షాలను కోరారు. 
 

Back to Top