తాడేపల్లి: చంద్రబాబు ఉదయం మాట్లాడింది. పవన్ కల్యాణ్ సాయంత్రం మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకు దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్నాడు. సొంతంగా పార్టీ పెట్టానని చెప్పుకోవడం కాదు పవన్.. సొంతంగా ఆలోచించడం కూడా నేర్చుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్, చంద్రబాబులకు లేదని, స్థాయి తెలుసుకొని మాట్లాడాలన్నారు. వైయస్ జగన్ ధైర్యసాహసాలతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడిందన్నారు. సోనియాగాంధీని ఎదిరించిన నిలబడిన నాయకుడిపై తప్పుడు కేసులు బనాయించారని, దీనిలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని, చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకొని తప్పుడు కేసులు పెట్టించారన్నారు. అప్పుడు పవన్ కల్యాణ్ కళ్లు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు. నేరం మోపబడిన వ్యక్తి దోషి ఎలా అవుతారు.. వెయ్యి పుస్తకాలు చదివితే వచ్చిన జ్ఞానం ఇదేనా..? ఏ పుస్తకంలో, ఏ రాజ్యాంగంలో చెప్పారో పవన్ కల్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు ఏసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘సీఎం వైయస్ జగన్ 21, 22 తేదీల్లో ఢిల్లీలో పర్యటించారు. అక్కడ వైయస్ఆర్ సీపీ ఎంపీలను, అధికారులను కలుసుకొని రాష్ట్ర సమస్యలు, వాటికి పరిష్కారాల గురించి చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను ఆయన పుట్టిన రోజు కలుసుకొని రాష్ట్రంలోని వివిధ సమస్యలపై 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం దృష్టికి అనేక అంశాలను, సమస్యలను తీసుకెళ్లడం, రాష్ట్రానికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన చేయడం. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టులో రివర్స్టెండర్ విధానం వల్ల రూ. 838 కోట్లు ఆదా చేశామని చెప్పడం. దాన్ని వారు ప్రోత్సహించడం, అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులను వెంటనే విడుదల చేయాలని మాట్లాడడం, విభజన హామీలు నెరవేర్చాల్సిందిగా, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే సాయాన్ని మరింత పెంచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రమంత్రి అమిత్షా ప్రకటించిన సందర్భాలను చూశాం. సీఎం వైయస్ జగన్ పర్యటన మీద చంద్రబాబు, పవన్ ఇద్దరూ అసందర్భమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ బరితెగించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏం కాపాడుతారు. ప్రజల నమ్మకాన్ని వైసీపీ పలుచన చేసింది అని పవన్ మాట్లాడడం బాధ్యతారహితం. పవన్ కల్యాణ్ చాలా పుస్తకాలు చదివానని, మేధావిని అని ఆయనకు ఆయనే వర్ణించుకుంటాడు. నేరం మోపబడిన వారు నేరస్తులు అవుతారు. నేరం మోపబడితే విచారణ జరుగుతుంటే.. దోషిగా చిత్రీకరించడం మన దేశ రాజ్యాంగంలో ఉందా..? నేరారోపణ చేయబడినవారు నేరస్తులు కాదు.. నిరూపణ అయిన తరువాతే దోషులు అవుతారు. వేల పుస్తకాలు చదివినా కూడా ఈ కనీస జ్ఞానం రాలేదా..? పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడుతాడో తెలియదు.. ఏం మాట్లాడుతాడో తెలియదు. అర్థం కాకుండా బాధ్యతారహిత మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారు. Read Also: ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు పవన్, చంద్రబాబులకే కాదు.. రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా.. సీఎం వైయస్ జగన్పై కేసులు ఎందుకు వచ్చాయి.. ఎలా పెట్టారు.. ఎప్పుడు పెట్టారు. సీఎం వైయస్ జగన్ ధైర్యసాహసాలకు తట్టుకోలేక, సోనియాగాంధీ నాయకత్వంలో ఉన్న రాజకీయ పార్టీని ఎదుర్కొని నిలబడినందుకు కేసులు పెట్టారు. వారికితోడుగా చంద్రబాబు చేతులు కలిపి, చీకట్లో చిదంబరాన్ని కలుసుకొని సీఎం వైయస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టారు. ఇది వాస్తవం కాదా.. మీకు తెలియదా.. అప్పుడు కళ్లు మూసుకున్నారా..? సీఎం వైయస్ జగన్ ధైర్యం గురించి పవన్ దగ్గర సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన కర్మ మాకు లేదు. వైయస్ జగన్ ధైర్యసాహసాలు ప్రదర్శించబట్టే వైయస్ఆర్ సీపీ నిలబడింది. పార్టీని స్థాపించి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను పదవులకు రాజీనామాలు చేయించి గెలిపించుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశారు. అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే తిరబడి పార్టీని బలోపేతం చేసిన యోధుడు సీఎం వైయస్ జగన్. 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఏమాత్రం వెనక్కు వెళ్లకుండా పార్టీని నడపబట్టే అంచెంచలమైన నేతగా సీఎం వైయస్ జగన్ వెలుగొందుతున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ పార్టీలోకి వెళ్లిన చంద్రబాబు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నాడు. అలాంటి నాయకుడికి మద్దతు కోసం జనసేనను స్థాపించిన వ్యక్తి పవన్. సొంత పార్టీ పెట్టానని చెప్పుకోవడం కాదు.. సొంతంగా ఆలోచించడం నేర్చుకోండి. విశాఖపట్నం ఎయిర్పోర్టులో సీఎం వైయస్ జగన్పై హత్యాప్రయత్నం చేస్తే దాన్ని చంద్రబాబు వెకిలిగా కోడికత్తి కేసు అంటే.. దాన్నిపట్టుకొని పవన్ మాట్లాడుతున్నారు. వైయస్ జగన్పై హత్యాయత్నం జరిగింది వాస్తవం. చంద్రబాబు డీఎన్ఏ, పవన్ డీఎన్ఏ ఒకటే అనుకునేట్లుగా ఇద్దరూ మాట్లాడుతున్నారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య టీడీపీ హయాంలో జరిగింది. సీబీఐ ఎంక్వైరీ వేయాలని గతంలో వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేసింది. సీఎం వైయస్ జగన్ పాలనలో పోలీసు వ్యవస్థ సక్రమంగా నడుస్తోంది. ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ వేస్తే పోలీసులపై నమ్మకం లేదా అని వారే మాట్లాడుతారు. పవన్ కల్యాణ్ సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ప్రకాశం జిల్లా వలసలను ఆపాలని పవన్ మాట్లాడుతున్నాడు.. అది పక్కనపెట్టి జనసేన నుంచి వెళ్లే వలసలను ఆపేందుకు ప్రయత్నిస్తే మంచిది. సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్కు లేదు. వైయస్ జగన్ ఓటమి ఎరుగని ధీరుడు. పవన్కు గెలుపు అంటే తెలీదు. రెండు చోట్ల పోటీచేసినా.. ఒక్క చోట కూడా గెలవలేదు. పవన్పై ప్రజలకు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోండి. 151 సీట్లు గెలిపించి వైయస్ జగన్ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. పవన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదు అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు సూచించారు. Read Also: ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు