తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ లో మీడియా ట్రైల్ జరుగుతోందని, కూటమి ప్రభుత్వం, కొందరు పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి చట్టపరిధిని మించి వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఎం.మనోహర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... కూటమి ప్రభుత్వం, పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి ఏమి లేకపోయినా గాలి వార్తలు సృష్టించి లిక్కర్ స్కామ్ పేరుతో రాజకీయాల్లో టాప్ పొజిషన్లలో ఉన్నవారిని, ఐఏఎస్ అధికారులు కొందరిని టార్గెట్ చేశారు. గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబు హయాంలో లిక్కర్ స్కామ్లో అతని పేరు చేర్చిన అధికారులను టార్గెట్ చేసుకుని దర్యాప్తును అపహాస్యం చేస్తున్నారు. ముఖ్యంగా మీడియా ట్రైల్ నిర్వహిస్తున్నారు, నేరం ఎలా జరిగిందనేది వారే రాస్తారు, అందులో ఎవరెవరు అనేది వారే రాస్తారు, ఇంకా ఎవరెవరెని చేర్చవచ్చో వారే డిబేట్లు నిర్వహిస్తారు. ఈ రోజు ఈనాడులో జగనే ఆదేశించారని రాజ్ కేసిరెడ్డి సిట్ విచారణలో చెప్పినట్లు వీరే అంతా రాసుకొచ్చారు. సిట్ ఏ ప్రశ్నలడిగిందో దానికి రాజ్ సమాధానాలు కూడా రాసుకొచ్చారు. జర్నలిజం ప్రమాణాలు గాలికొదిలేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాజ్ కేసిరెడ్డి ఒకటి చెబితే ఇక్కడ మరొకటి వస్తుంది, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారు. మిధున్ రెడ్డి బెయిల్ పిటీషన్పై హైకోర్టులో విచారణ సందర్భంగా ఆరోజు ప్రాసిక్యూషన్ వారు ఈ కేసు ఇంకా విచారణలో ఉంది, మిధున్ రెడ్డి పాత్ర ఎక్కడా ధృవీకరించలేదని ఇక్కడ చెప్పి మళ్ళీ సుప్రింకోర్టులో మిధున్ రెడ్డిగారికి సంబంధం ఉందని కౌంటర్ వేశారు, దీనిని బట్టి కోర్టులను కూడా తప్పుదోవపట్టించేలా ప్రాసిక్యూషన్ వారు వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగం, చట్టం, న్యాయస్ధానాలంటే లెక్కలేనితనంగా ఉంది, వీరికి ఎల్లో మీడియా వంతపాడుతోంది. మా నాయకుడు జగన్ గారి మీద ప్రతిరోజూ ఏదో విధంగా తప్పుడు కథనాలు వండి వడ్డిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పోలీస్ అధికారులు, ఎల్లో మీడియా ముగ్గురూ కలిసి ఎవరెవరెని ఎలా ఇరికించాలా అని ప్రయత్నిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే వైయస్ జగన్ గారిపై చేశారు. ఎల్లో మీడియాకు రాష్ట్రంలో టీడీపీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుంది. చట్ట పరిధికి లోబడకుండా వ్యవహరిస్తున్నప్రతి ఒక్కరినీ మేం కోర్టుకీడుస్తాం, ప్రజలు కూడా ఎల్లో మీడియా మాటలు నమ్మకుండా స్వతంత్రంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామని మనోహర్ రెడ్డి అన్నారు.