రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలనతో అరాచకం

తప్పుడు కేసులతో రాజకీయ కక్షసాధింపు

పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసుల బనాయింపు దుర్మార్గం

ఒత్తిళ్ళతో పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు

గీత దాటిన పోలీసులను న్యాయ వ్యవస్థ ముందు నిలబెడతాం

వైయస్‌ఆర్‌సీపీ నాయకుల ఆగ్రహం

నరసరావుపేటలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీ సుధీర్‌ భార్గవ్‌రెడ్డి

నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన పేరుతో అరాచకం సృష్టిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీ సుధీర్‌ భార్గవ్‌రెడ్డిలు మండిపడ్డారు. నరసరావుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, పోలీసులను కేవలం రాజకీయ కక్షసాధింపులకు వాడుతున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై జంట హత్యల కేసును బనాయించడం ఈ దుర్మార్గ పాలనకు పరాకాష్టగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్ళతో గీత దాటి వ్యవహరిస్తున్న పోలీసులు భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ ముందు దోషులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. 

ఇంకా వారు ఏమన్నారంటే...

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ 'ఏపీ పొలిటికల్ సర్వీస్'‌గా మారింది :  మాజీ ఎమ్మెల్యే విడదల రజిని

రాష్ట్రంలో ఏడాది కాలంగా రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది. వైయస్ఆర్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలను వేధించడానికి అక్రమ కేసులు బనాయించి, జైళ్ళకు పంపుతున్నారు. అలాంటిదే పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంటహత్యల కేసుల్లో వైయస్ఆర్‌సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలను కూడా ఇరికించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీడీపీకి చెందిన నాయకులు తోట వెంకట్రామయ్య, జవిశెట్టి శ్రీనివాస్‌లు కలిసి తమ పార్టీకే చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను హతమార్చారు. ఈ హత్య తరువాత జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ జంట హత్యల కేసులో చనిపోయిన వారు, చంపిన వారు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని చాలా స్పష్టంగా వెల్లడించారు. జంటహత్యల్లో మృతుడు వెంకటేశ్వరరావు గత మూడు దశాబ్ధాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లోనూ వీరు చాలా చురుకుగా రాజకీయాల్లో పాల్గొన్నారు. వారి మధ్య వర్గపోరు వల్లే ఈ హత్యకు కారణం. అయినా కూడా ఏ మాత్రం సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడి పేర్లను ఈ కేసులో ఇరికించడం దారుణం. మృతుల కుటుంబసభ్యులు కూడా టీడీపీలోని వర్గపోరు వల్ల ఈ హత్యలు జరిగాయని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆ కుటుంబాలను కలిసిన తరువాత ఇందులో వైయస్ఆర్‌సీపీ నేతలు పిన్నెల్లి, ఆయన సోదరుడు ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి పోలీసులు కూడా అదే కోణంలో కేసును నమోదు చేయడం ప్రారంభించారు. ఈ హత్య ఎందుకు జరిగిందనేది అందరికీ తెలుసు. రాజకీయ ఒత్తిళ్ళతో ఇంత దారుణంగా తప్పుడు కేసులు బనాయిస్తారా? రాజకీయ కక్షతో పిన్నెల్లి సోదరులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నుంచి వారి పేర్లను తొలగించాలని వైయస్ఆర్‌సీపీగా డిమాండ్ చేస్తున్నాం. ఏపీ పోలీస్ సర్వీసుకు బదులు ఏపీ పొలిటికల్ సర్వీస్‌గా మారుస్తున్నారు. రాష్ట్రంలో ఎంత మంది వైయస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులను ఇలాంటి తప్పుడు కేసుల్లో వేధిస్తున్నారు. ఇటీవలే హరికృష్ణ అనే యువకుడిపై ఎంత దారుణంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి, కనీసం నడవలేని స్థితికి తీసుకువచ్చారో అందరూ చూశారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపైనా, చిలుకులూరిపేటలో నాపైన కూడా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాజకీయ మెప్పుదల కోసం పోలీసులు పనిచేస్తుండటం వల్లే ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. గత వైయస్ఆర్‌సీపీ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తితో పాలన చేస్తే, నేడు రెడ్‌బుక్ రాజ్యాంగం ప్రకారం పోలీసులు పనిచేస్తున్నారు. ఎల్లకాలం టీడీపీనే అధికారంలో ఉంటుందనే భ్రమల నుంచి గీత దాటి వ్యవహరిస్తున్న పోలీసులు గ్రహించాలి. తప్పు చేసిన వారు అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిగా న్యాయవ్యవస్థ ముందు దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుంది. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు మైనింగ్ వ్యవహారంలో కేసులు పెట్టారు. ఆయనను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. జగన్ గారి హయాంలో గుడ్ గవర్నెన్స్ ఉంటే, నేడు చంద్రబాబు పాలనలో హరాష్‌ గవర్నెన్స్ కనిపిస్తోందని మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 పిన్నెల్లి సోదరులను ఎలా బాధ్యులుగా చేస్తారు? :  మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఈ నెల 24న గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు అనే టీడీపీ నాయకుల హత్యలు జరిగాయి. ఈ జంటహత్యలకు టీడీపీలోని వర్గపోరు కారణమని, చనిపోయినవారు, ముద్దాయిలు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినవారేనని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలోనే ప్రకటించారు. కానీ హటాత్తుగా ఈ కేసులో వైయస్ఆర్‌సీపీకి చెందిన నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఎక్కించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైయస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేయడం ఒక అలవాటుగా మారింది. పేర్ని నాని కుటుంబంమీద, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వల్లభనేని వంశీ, నందిగాం సురేష్ ఇలా పలువురు నాయకులపై పెద్ద ఎత్తున తప్పుడు కేసులు పెట్టి వేధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఆటవిక పాలనకు ఇది నిదర్శనం. ఎఫ్ఐఆర్‌లో ఏ-1గా వున్న జవిశెట్టి శ్రీను హత్య తరువాత మాట్లాడుతూ వచ్చేది వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే, మాకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అండ వుంది, వారు చెబితేనే ఇలా చేస్తున్నాం, మాకు ఏదైనా ఆపద వస్తే వారే చూసుకుంటారు అని బెదిరించి వెళ్లినట్లు ఎఫ్ఐఆర్‌లో రికార్డు చేశారు. ఇది పోలీసులు కట్టుకథ కాదా? హంతకులు పారిపోతూ, తాము చేసిన దాని గురించి వివరాలు చెప్పి పరారైనట్లు పోలీసులు రికార్డు చేశారు. ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అలాగే సంఘటనా స్థలంలో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి చెందిన వాహనంలోనే ముద్దాయిలు వచ్చారు. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ జవిశెట్టి శ్రీను అనే వ్యక్తి గతంలో వైయస్ఆర్‌సీపీలో పనిచేశాడు, గత ఏడాది ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరాడు. గత ఎన్నికల్లో టీడీపీ తరుఫున ఆయన పనిచేశాడు. గత పదిహేను రోజుల వరకు కూడా హత్యకు గురైన వారితోనే కలిసి రాజకీయాలు చేశాడు. ఇటీవల ఒక ఫ్లెక్సీ వివాదంలో ఒక యువకుడిని ఒకవర్గం కొట్టడంతో జెవిశెట్టి శ్రీనుకు, చనిపోయిన వారికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ముద్దాయి జవిశెట్టి శ్రీను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తలా పనిచేశాడు. అతను చేసిన ఈ హత్యకు పిన్నెల్లి సోదరులకు ఏం సంబంధం? తోట వెంకట్రామయ్య అనే వ్యక్తి జవిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి ఈ హత్యలు చేయించారని మృతుల బందువులే చెబుతున్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ నాయకులను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఈ రకమైన తప్పుడు కేసులు పెడుతున్నారు. జిల్లా ఎస్పీని కూడా కలిసి వినతపత్రం సమర్పించేందుకు సమయం కావాలని కూడా అడిగాం. ఇటువంటి తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా చేసి, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన నాయకుడి మీదే ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఇలాంటి తప్పుడు కేసులు :  సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జి.సుధీర్ భార్గవ్‌రెడ్డి

ఏడాది కాలంగా ఎన్నికల హామీలను అమలు చేయలేక, తమ అసమర్థత నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే వైయస్ఆర్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై అక్రమ కేసులు బనాయించారు. ఇప్పటికే వారిపై అనేక కేసులు నమోదు చేసి వేధించారు. తాజాగా వెల్దుర్తి మండలంలో జరిగిన జంట హత్యలు టీడీపీలోని ఆదిపత్యపోరు కారణంగా జరిగితే, దానిలో పిన్నెల్లి సోదరులను ఇరికించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అత్యంత దుర్మార్గం. మృతుల బంధువులే ఇది టీడీపీ వారి వల్లే జరిగిందని చెబుతున్నా, జిల్లా ఎస్పీ సైతం దీనినే ధ్రువీకరించినా కూడా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిళ్ళతో పిన్నెల్లిపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇటువంటి దుర్మార్గాలను సహించేది లేదు. న్యాయపరంగా దీనిపై పోరాడతాం. పిన్నెల్లి సోదరులకు పార్టీ పరంగా అండగా ఉంటామని సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జి.సుధీర్ భార్గవ్‌రెడ్డి తెలిపారు.
.

Back to Top