రైతుల కష్టాలు కనపడవా?

ప్రజాప్రతినిధులపై వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి ఫైర్ 

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో దిక్కుతోచని స్థితిలో ఉమ్మడి జిల్లా రైతాంగం

ఐదారు రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం.. ఒక్క సమీక్ష చేశారా? 

ఉమ్మడి జిల్లాకు 1.14 లక్షల క్వింటాళ్లు మాత్రమే కేటాయించడమేంటి?

అసలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఉన్నారా? 

తక్షణం ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలి

విత్తనాల పంపిణీ ప్రారంభించి ఎరువులు అందుబాటులో ఉంచండి

అనంతపురం  : ప్రజాప్రతినిధులు తమ స్వార్థ్యం, స్వప్రయోజనాలను వీడి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తున్నా అన్నదాతల గురించి పట్టించుకునే నాథులే కరువయ్యారని, ఇప్పటి వరకు కనీసం ఒక్క సమీక్ష చేసిన పాపానపోలేదని మండిపడ్డారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. మంగళవారం వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయని, మరో ఐదారు రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుందన్నారు. విత్తన కేటాయింపులు, సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 15 లక్షల ఎకరాలకు పైబడి అన్ని పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. ఇందుకోసం 3.11 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని ప్రతిపాదనలు పంపితే కేవలం 1.14 లక్షల క్వింటాళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. గత ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు నష్టపోయాయని, ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికంగానే పంటలు సాగు అవుతాయన్నారు. ఓ వైపు రైతులు పంట సాగు సన్నాహకాల్లో ఉన్నా ఇప్పటి వరకు వేరుశనగ, కంది, ఆముదం, మొక్కజొన్న, పత్తి తదితర విత్తనాలు సరఫరా కాలేదన్నారు. గత రబీలో నాణ్యమైన విత్తనాలు వచ్చినా వాటిని కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకోలేదన్నారు. రబీలో సాగు చేసిన వేరుశనగ అంతా ఇతర జిల్లాలకు తరలిపోయిందన్నారు. సాగుకు తగ్గట్టుగా విత్తనాలు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమవుతోందని తెలిపారు. 40 శాతం సబ్సిడీతో వేరుశనత విత్తనం సరఫరా చేస్తామని చెబుతున్నారని, ఈనెలాఖరులోగా అన్ని రకాల విత్తనాల పంపిణీని ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉందన్నారు. 

ఇస్తామన్న పెట్టుబడి సాయం ఏదీ?
వైఎస్‌ జగన్‌ హయాంలో రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా రూ.13,500 అందజేశాయని అనంత వెంకటరామిరెడ్డి గుర్తు చేశారు. గత ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు అందిస్తామని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కేంద్రం వాటాతో కలిపి రూ.20 వేలు ఇస్తామని అంటున్నారన్నారు. పోనీ అదైనా ఇచ్చారా అంటే ఒక ఖరీఫ్, రబీ సీజన్‌ ముగిసి మరో ఖరీఫ్‌ సమీపిస్తున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వైయ‌స్ జగన్‌ హయాంలో రైతులకు సున్నావడ్డీ, పావలా వడ్డీ అందేవని, కానీ నేడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. బ్యాంకర్లు రుణాలను రెన్యూవల్‌ చేయడం లేదని, రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఒక్క ప్రజాప్రతినిధి కూడా మాట్లాడడం లేదన్నారు. 

ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలి
2023–2024 ఖరీఫ్‌లో 17 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఎన్నికల తర్వాత కేంద్ర బృందం కూడా పర్యటించిందన్నారు. కానీ ఇప్పటి వరకు ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. అదేవిధంగా 2024 ఖరీఫ్‌ సీజన్‌లో కూడా పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారని, కానీ కేవలం 7 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారన్నారు. సెంట్రల్‌ టీం వచ్చి వెళ్లినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకున్న దాఖలా లేదని తెలిపారు. వైయ‌స్‌ జగన్‌ హయాంలో ఉచిత పంటల బీమా అమల్లో ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాన్ని తీసేశారని అన్నారు. గత ఖరీఫ్, రబీ సీజన్‌లలో పంట నష్టపోయిన రైతాంగానికి కూడా ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించలేదన్నారు. ప్రజాప్రతినిధులు మాటలకే పరిమితం అవుతున్నారని, ఇటీవల జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి వెళ్లినా కనీసం రైతు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లలేకపోయారన్నారు.  

ఒక్క సమీక్ష అయినా చేశారా? 
ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఒక్క సమీక్ష అయినా జరిపారా? అంటూ ప్రజాప్రతినిధులపై అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. రైతుల కష్టాలను ఇప్పటికే ప్రతిపక్షాలు, రైతు సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయని.. పత్రికల్లో కూడా అనేక కథనాలు వస్తున్నట్లు చెప్పారు. ఇటీవల తాను వ్యవసాయశాఖ జేడీతో మాట్లాడితే వారం, 10 రోజుల్లో విత్తనాలు పంపిణీ చేస్తామని అంటున్నారని, కానీ రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు అందే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీలకు చెందిన వాళ్లే ఉన్నా రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల జెడ్పీ సమావేశం ఐదారు గంటలు జరిగితే రైతు సమస్యలపై ప్రస్తావించిన పాపానపోలేదన్నారు. అనవసరమైన విషయాలు, ఆ ఫొటో ఇక్కడుండాలి.. ఈ ఫొటో అక్కడుండాలి.. అని అనుకోవడమే సరిపోయిందన్నారు.  

అధిక ధరలకు ఎరువుల అమ్మకాలు
గత ఏడాది డీఏపీ, యూరియా, పొటాష్‌ కృత్రిమ కొరత సృష్టించారని అనంత తెలిపారు. బస్తాపై రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా అమ్ముకున్నారన్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉందన్నారు. మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్‌లలో మాత్రమే యూరియా, డీఏపీ, పొటాష్‌ పెట్టుకున్నారని, కానీ అది 20 శాతం కూడా సరిపోదన్నారు. ఈ నేపథ్యంలో రిటైల్‌ వ్యాపారస్తుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుందని, కానీ వాళ్ల వద్ద కూడా స్టాక్‌ లేదన్నారు. మరో పది, 15 రోజుల్లో పంటలు సాగు చేయాలంటే ఎరువులు అందుబాటులో లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. 

ఆదాయం, వ్యాపారాలపైనా దృష్టి
రైతులు అష్టకష్టాలు పడుతుంటే ప్రజాప్రతినిధుల దృష్టంతా ఆదాయం, వ్యాపారాలపైనే ఉందని అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలను, వైయ‌స్ జగన్‌ను విమర్శించడంపైనే శ్రద్ధ చూపిస్తున్నారని.. ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన రైతాంగాన్ని పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ సీజన్‌ ప్రారంభం అవుతున్నా ఒక్క సమీక్ష చేయలేదని, అసలు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఉన్నారా? అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని చెప్పారు. కడపలో మహానాడు జరుగుతోందని.. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి, అందరూ అక్కడే ఉంటారన్నారు. తక్షణం సీఎంతో మాట్లాడి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగం కష్టాలు తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
 

Back to Top