బాలకృష్ణ ఆదేశాలతోనే హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయం ధ్వంసం

అయినా మా పార్టీ వారిపైనే కేసుల నమోదు అత్యంత హేయం

వైయస్ఆర్‌సీపీ మహిళా నాయకురాళ్ల ధ్వజం

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీ సత్యసాయి జిల్లా 

వైయస్ఆర్‌సీపీఅధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్, హిందూపురం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌ దీపిక 

తక్షణమే ఆ అక్రమ కేసులన్నీ ఎత్తేయాలి

దాడిలో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలి

ప్రెస్‌మీట్‌లో ఉషాశ్రీ చరణ్, దీపిక డిమాండ్‌

తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గుండాల దాడి జరిగిన రోజున ఎమ్మెల్యే బాలకృష్ణ, నియోజకవర్గంలోనే ఉన్నారని, ఆ స్థాయిలో విధ్వంసం సృష్టించినా ఆయన కనీసం మాట్లాడలేదంటే, తన ప్రోద్భలంతోనే దాడి జరిగినట్లు స్పష్టంగా తెలిసిపోతుందని పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్, హిందూపురం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌ దీపిక తేల్చి చెప్పారు. ఈ తరహా ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు ఏవిధంగా పతనం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చని వారన్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల వివరాలను సీసీ కెమెరా ఫుటేజ్‌తో పాటు ఇస్తే వారిని శిక్షించాల్సింది పోయి, ఆ పని చేయకుండా, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపైనే ఎస్సీ అట్రాసిటీతో పాటు, హత్యాయత్నం కేసులు నమోదు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వారు ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతు నొక్కాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం తమను భయపెట్టే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఉషాశ్రీ చరణ్, దీపిక తెలిపారు. అందుకే అక్రమ కేసులతో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు, అరెస్టులు, వేధింపులు సర్వసాధారణం అయ్యాయని చెప్పారు. హిందూపురంలో తమ పార్టీ వారిపై నమోదు చేసిన కేసులన్నీ వెంటనే ఎత్తివేయడంతో పాటు, పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ప్రెస్‌మీట్‌లో ఉషాశ్రీ చరణ్, దీపిక ఏం మాట్లాడారంటే..:

● నిందితులను వదిలి మాపై కేసులా!
:ఉషాశ్రీ చరణ్‌ - శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షురాలు.

అక్రమ అరెస్టులు, కేసులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న సీఎం చంద్రబాబు కుట్రలు ఇంకెన్నో రోజులు సాగవు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినందుకు హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. ఆరు కారుల్లో వచ్చిన గూండాలు కార్యాలయంలో ఉన్న శ్రీభక్త కనకదాసు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలను చింపేయడంతో పాటు, దివంగత మహానేత వైయస్సార్‌ విగ్రహాన్ని కూడా పడేసి అధికార జులుం ప్రదర్శించారు. ఆ సమయంలో అక్కడ పోలీసులున్నా, చోద్యం చూశారే తప్ప, విధ్వంసకారులను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరగా జరుగుతున్న దౌర్జన్యాలు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగం అమలవుతోందా? అనే అనుమానం కలుగుతోంది. ఈ దాడికి సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే బాలకృష్ణ సమాధానం చెప్పాలి. హిందూపురం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్‌ దీపిక భర్త వేణురెడ్డిపై దాడి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన టీడీపీ గుండాలు, అప్పుడు ఆయన అక్కడ లేకపోవడంతో, పార్టీ ఆఫీస్‌లో విధ్వంసం సృష్టించారు.
    సీసీ కెమెరాల సాక్షిగా దాడిలో పాల్గొన్న రౌడీలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యల్లేవు. కానీ ఆ సమయంలో అక్కడ లేని హిందూపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ దీపిక భర్త వేణురెడ్డితో పాటు, దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పార్టీ కార్యకర్తల మీద ఎస్సీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు పెట్టారు. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. 

● దాడికి ఎమ్మెల్యే బాలకృష్ణదే బాధ్యత: దీపిక - హిందూపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌.

హిందూపురం వైయస్ఆర్‌సీపీ కార్యాలయం మీద దాదాపు 70 మంది గూండాలు దాడి చేసి ధ్వంసం చేశారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాన్ని దారుణంగా ధ్వంసం చేసినా కనీసం టీడీపీ నాయకులెవరూ దీనిపై స్పందించక పోవడం చూస్తుంటే ప్రజాస్వామ్య పరిరక్షణ, చట్టాలను ఏ విధంగా అమలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేక రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అడ్డుకున్న వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలిసే పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది.

Back to Top