దళితులపై దాడులు ఆగాలంటే వైయస్‌ జగన్‌ రావాలి

ఏపీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిరుద్యోగుల పట్ల శాపంగా మారిందిl

అంబేడ్కర్‌ భావజాలం కలిగిన వ్యక్తి వైయస్‌ జగన్‌

అన్నివర్గాలకు మేలు జరిగేలా వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున

విజయవాడ: దళితులపై దాడులు ఆగాలంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ అధ్యయన కమిటీ సమావేశం మేరుగ నాగార్జున అధ్యక్షతన జరిగింది. సమావేశంలో దళితులకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. అనంతరం మేరుగ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దళిత నిరుద్యోగుల పట్ల శాపంగా తయారైందని మండిపడ్డారు. అన్నివర్గాల వారికి మేలు జరిగేలా వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కంటే మిన్నగా దళితులకు అండగా ఉండాలనే ఆలోచనలో వైయస్‌ జగన్‌ ఉన్నారన్నారు. ప్రతి ఇంట్లో నాన్న ఫొటోతో పాటు తన ఫొటో కూడా పెట్టుకునే విధంగా వైయస్‌ జగన్‌ పాలన చేస్తారన్నారు. దళిత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో రూపొందిస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ విభాగానికి సంబంధించిన వివిధ అంశాలపై మేనిఫెస్టో కమిటీ సభ్యులం సమావేశమయ్యామని చెప్పారు. 

బాబు పాలనలో దళిత మంత్రులకు మాట్లాడే ఛాన్స్‌ లేదని, దళితులపై దాడులు జరిగితే నోరుమెదపలేని మంత్రులకు గుణపాఠం తప్పదన్నారు. దళిత సంక్షేమాన్ని, దళిత చట్టాలను పాతరేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో గుణపాఠంగా ఉంటుందన్నారు. మోసం చేసిన వ్యక్తులకు బుద్ధిరావాలంటే దళిత లోకమంతా ఒక్క తాటిపైకి రావాలన్నారు. అంబేడ్కర్‌ భావజాలాన్ని భుజాన వేసుకున్న వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత అభివృద్ధి జరుగుతుందన్నారు. 

భ్రష్టువదలాలంటే వైయస్‌ జగన్‌ కావాలి

వ్యవస్థలకు పట్టిన చెదలు వదలాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని వైయస్‌ఆర్‌ సీపీ నేత పండుల రవీంద్రబాబు అన్నారు. రావాలి జగన్‌ – కావాలి జగన్‌ అనే నినాదం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో తయారు చేస్తున్నామన్నారు. దళిత అభివృద్ధికి వైయస్‌ జగన్‌ పెద్దపీట వేస్తున్నారన్నారు. దళితుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మేనిఫెస్టో కమిటీ సభ్యులం భేటీ అయ్యామని, మరో రెండు సార్లు భేటీ అనంతరం మేనిఫెస్టోలో అంశాలను పొందుపరిచి వైయస్‌ జగన్‌కు అందిస్తామన్నారు. ప్రతి జిల్లా నుంచి దళిత సంక్షేమం కోసం వచ్చే సలహాలన్ని స్వీకరిస్తున్నామని, న్యాయం జరిగేలా మేనిఫెస్టో తయారు చేస్తామన్నారు.  

   
Back to Top