విజయవాడ: అగ్రిగోల్డు బాధితుల బాధలు చంద్రబాబు ప్రభుత్వానికి పట్టవా అని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేబినెట్ సమావేశంలో, గవర్నర్ ప్రసంగంలో అగ్రిగోల్డు ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డు బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిసారి అగ్రిగోల్డు బాధితులను చర్చలకు పిలిపించి మరునాడు నీరుగార్చుతున్నారని విమర్శించారు. రూ.1183 కోట్లు ఇస్తే సుమారు 80 శాతం మంది బాధితులందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పారు. ఆ రోజు మమ్మల్ని హేళన చేశారన్నారు. బాధితులు కొద్ది రోజులు ఓపిక పడితే ప్రజా ప్రభుత్వం వస్తుందని, వైయస్ జగన్ సీఎం కాగానే ఆరు నెలల్లోనే అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో ఆ తరువాత ప్రభుత్వం ముందుకు వచ్చి మేమే చేస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు శాసన సభ జరుగుతుందని, అగ్రిగోల్డు బాధితులకు మీరు న్యాయం చేస్తారా? లేదా అని నిలదీశారు. అసలు బాధితులకు ఏం ఇస్తారో సమాధానం చెప్పడం లేదన్నారు. కేబినెట్ మీటింగ్లో చర్చించి కోర్టు జప్తు చేయని ఆస్తులను, కొత్త ఆస్తులను కూడా కనుగొన్నామని, రూ.250 కోట్లు ఇస్తామని చెప్పారన్నారు. కేబినెట్ మీటింగ్ ఈ నెల 21న జరిగితే 22 అంశాలు చర్చించారని, అగ్రిగోల్డు బాధితుల అంశం ఎక్కడా కనిపించలేదన్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం టీడీపీ గజిట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో అగ్రిగోల్డు బాధితులకు రూ.250 కోట్లు ఇస్తున్నట్లు కథనాలు రాశారన్నారు. ఈ కథనాలు చూసి బాధితులు హర్షం వ్యక్తం చేశారన్నారు. తీరా చూస్తే క్యాబినెట్లో తీర్మానం లేదని, అసెంబ్లీలోని గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదన్నారు. ఈ ప్రభుత్వానికి బాధితుల పట్ల చిత్తశుద్ది లేదని, అగ్రిగోల్డు ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బాధితులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని, వాచ్ డాగ్ లాగా ఆగ్రిగోల్డు ఆస్తులను కాపాడుతుందని, బాధితులకు మేలు చేస్తుందని హామీ ఇచ్చారు. అఖరి శాసన సభ సమావేశాల్లోనైనా మీరు చెప్పిన రూ.250 కోట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఫిబ్రవరి 4న విజయవాడలోని ధర్నా చౌక్లో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బా«ధితులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.