తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. ఛలో మెడికల్ కాలేజీ పేరిట.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ధర్నాను అడ్డుకునేందుకు వైయస్ఆర్సీపీ నేతలపైకి కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోంది. ముందస్తుగా నోటీసులు జారీ చేస్తూ..ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టు చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాలను లెక్క చేయకుండా యువత మెడికల్ కాలేజీల వద్దకు కదం తొక్కుతున్నారు. నంద్యాల జిల్లా .. వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో చలో నంద్యాల మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగున అడ్డుకుంటున్నారు. మెడికల్ కాలేజ్ ప్రవేటికరణ చేసిన చంద్రబాబు తీరు మార్చుకోవాలని విద్యార్థులు, యువత శాంతియుత నిరసన చేపట్టేందుకు నంద్యాలకు వెళ్తుండగా రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ని కర్నూలులోని ఆయన నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లను ప్రవేటికరణ కార్యకమాన్ని శాంతి యుతంగా చేస్తాం అంటే ఎందుకు అడ్డుకుంటారని పోలీసులను సిద్ధార్థరెడ్డి నిలదీశారు. ప్రభుత్వ ఒత్తిడితో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన ఇంటి వద్దకు వైయస్ఆర్సీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో సిద్దార్థ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఛలో నంద్యాల మెడికల్ కాలేజ్ కార్యాక్రమంలో భాగంగా నంద్యాల మెడికల్ కాలేజ్ దగ్గర జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు సురేష్ యాదవ్ జిల్లా నాయకులు నాయక్,ధీరజ్,నాయుడు,అశోక్ తదితరులను 3 టౌన్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన చలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మెడికల్ కాలేజీ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు పెనుకొండ మెడికల్ కాలేజీ వద్దకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, యువకులు తరలివచ్చి చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా... అమలాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల వద్ద వైయస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత వైయస్ఆర్సీపీ హయాంలో పేద, మధ్య తరగతి ప్రజల మేలు కోసం 17 మెడికల్ కాలేజీలకు వైయస్ జగన్ అనుమతి తీసుకొచ్చారు. తద్వారా అతి తక్కువ ఖర్చుకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలని ఆయన ఆశించారు. ఈ క్రమంలో కొన్ని కాలేజీల్లో తరగతులూ ప్రారంభం అయ్యాయి కూడా. అయితే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిర్మాణంలో ఉన్న కాలేజీలనూ పట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు పీపీపీ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ఈ క్రమంలో మంత్రులతో తప్పుడు ప్రచారం సైతం చేయించారు. మెడికల్ కాలేజీలను తన బినామీలకు దోచి పెడుతున్న చంద్రబాబు చర్యలను నిరసిస్తూ వైయస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. పార్టీ యువత, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత దాకా ఆందోళనలు కొనసాగుతాయని జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా హెచ్చరించారు. అమలాపురం మెడికల్ కాలేజ్ వద్దకు బయలుదేరిన అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మిని ఆమె ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా .. మార్కాపురం లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రవేటికరణ చేయడంపై వైయస్ఆర్సీపీ నాయకులు నిరసన తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతి లేదని మార్కాపురం పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. చీమకుర్తిలోని బూచేపల్లి నివాసంలో దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి చీమకుర్తి ఎస్ఐ కృష్ణయ్య ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్సీపీ ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కార్యక్రమం మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. వైయస్ఆర్సీపీ తలపెట్టిన ఛలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి పోలీసులు అడ్డంకులు సృష్టించారు. వైయస్ఆర్సీపీ నేతల ఇళ్ళ వద్ద పోలీస్ కాపలా ఏర్పాటు చేశారు. నేతలను హౌస్ అరెస్టు చేసి.. నోటీసులు అందజేశారు. మాజీ ఎంపీ మార్గాన్ని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్, వైయస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అల్లూరి జిల్లా.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాడేరు శాసనసభ్యులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ గుమ్మా తనూజ రాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. యువత, విద్యార్ధులు పెద్ద ఎత్తున పాడేరు మెడికల్ కాలేజీ వద్దకు తరలివచ్చారు. వైయస్ఆర్సీపీ నేతలు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పాడేరు మెడికల్ కాలేజీకి చేరుకొని కాలేజీని సందర్శించారు. రూ. 500 కోట్లతో 35 ఎకరాల్లో వైయస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారని, ఇప్పటికే మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభమయ్యాయని వైయస్ఆర్సీపీ పేర్కొన్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం వలన 150 ఎంబీబీఎస్ సీట్లు, 50 సీట్లకు కుదింపు చేశారని విమర్శించారు. వైయస్ జగన్ పాలనలో 70 శాతానికి పైగా పూర్తయిన మెడికల్ కాలేజీ నిర్మాణం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నత్త నడకన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా.. నర్సీపట్నం చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పోలీసు ఆంక్షలను లెక్కచేయకుండా యువత, విద్యార్ధులు భారీగా తరలివచ్చారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైయస్ఆర్సీపీ నేతలు సందర్శించకుండా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీ వద్దకు వస్తున్న వైయస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఛలో మెడికల్ కాలేజీకి అనుమతి లేదంటు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు తీరుపై వైయస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. మచిలీపట్నం.. చలో మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిరసనకు వెళ్లకుండా వైయస్ఆర్సీపీ నేతలు,శ్రేణులపై పోలీసులు ఆంక్షలు విధించారు. మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్లో వైయస్ఆర్సీపీ నేతలు దేవినేని అవినాష్ , మొండితోక జగన్మోహన్ రావు , దేవభక్తుని చక్రవర్తి , వైయస్ఆర్సీపీ విద్యార్ధి విభాగం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమ వాహనాలను అడ్డుకోవడంతో వాహనాలను అక్కడే వదిలేసి నడుచుకుంటూ వైయస్ఆర్సీపీ నేతలు మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు నిరసనగా "ఛలో ఏలూరు మెడికల్ కాలేజ్" కార్యక్రమానికి బయలుదేరిన వైయస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యువకులు, విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా.. చలో పల్నాడు మెడికల్ కాలేజీ కార్యక్రమం వైయస్ఆర్సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి బయలుదేరారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిని తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ వద్ద ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్సీపీ తలపెట్టిన ఛలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు , మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ , జిల్లా యువజన , విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. వైయస్ఆర్సీపీ యువనేత ధర్మాన రామమనోహర్నాయుడు ఆమదాలవలసలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్ఆర్ జిల్లా.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైయస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చలో పులివెందుల మెడికల్ కాలేజీ కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరు లో మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు యువజన విభాగం అధ్యక్షుడు గురునాథ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందులకు యువకులు తరలివెళ్లారు. బాపట్ల జిల్లా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ‘ఛలో బాపట్ల మెడికల్ కాలేజీ’ పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున , పర్చూరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గాదె మధుసూదన్ రెడ్డి , అద్దంకి, బాపట్ల , రేపల్లె నియోజకవర్గం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జులు మెడికల్ కాలేజ్ దగ్గరకు శాంతియుతం నిరసన ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఆదోనిలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదోని నియోజకవర్గ సమన్వయకర్త సాయిప్రసాద్ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుక, పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి, రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ బుట్టా ప్రతుల్, కర్నూలు నగర అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్, కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు శివా రెడ్డి , విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రశాంత్, ముఖ్య నాయకులు, అన్ని అనుబంధ విభాగాల నాయకులు, యువత భారీ ఎత్తున పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా.. వైయస్ఆర్సీపీ పిలుపు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు ఆధ్వర్యం చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం నిర్వహించారు. పార్వతీపురం లో ఉన్న స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి మెడికల్ కాలేజ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి నిలిచిపోయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులను పరిశీలించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ ఉప ముఖ్యమంత్రులు పుష్ప శ్రీవాణి , పిడికి రాజన్న దొర , శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు , రెడ్డి శాంతి ,గొర్లె కిరణ్ కుమార్, విశ్వసరాయి కళావతి , ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్,యువ నాయకులు ధర్మాన రామ మనోహర్ నాయుడు, మన్యం జిల్లా యూత్ అధ్యక్షులు నంగిరెడ్డి శరత్ కుమార్ ,మన్యం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు బొత్తాడ గౌరీ శంకర్ , శ్రీకాకుళం జిల్లా యూత్ అధ్యక్షులు మార్పు పృద్వి శ్రీకాకుళం జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు ముత్తా విజయ్, ముఖ్య నాయకులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మదనపల్లిలో ప్రచార విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి, యువజన విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ హేమంత్ రెడ్డి ఆధ్వర్యంలో“చలో మెడికల్ కాలేజ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, దేశాయ్ తిప్పా రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిస్సార్ అహ్మద్, తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.