మీ పిల్లలను బడికి పంపించండి..మామగా అండగా ఉంటా

రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొస్తాం

మన పిల్లలు దేశంలో ఎవరితోనైనా పోటీ పడాలి

ఏప్రిల్, మే నెలల్లోనే పుస్తకాలు స్కూళ్లకు చేరాలి

ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం

పిల్లలను బడికి పంపించిన తల్లులకు జనవరి 26న రూ.15 వేలు అందజేస్తాం

అమరావతి: రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొస్తామని, మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు..వారికి మామగా అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ఏ ఒక్కరూ కూడా అవస్థలు పడకూడదని ఆయన భరోసా కల్పించారు. పిల్లలను బడికి పంపించిన తల్లిదండ్రులకు ప్రతి ఏటా రూ.15 వేలు అమ్మ ఒడి పథకం కింద అందజేస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెనుమాక జెడ్పీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన రాజన్న బడిబాట –సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

ఈ రోజు నాకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పిల్లలు బడికి వెళ్లాలని పెద్ద పెద్ద చదువులు చదవాలి. ఇందుకోసం ఏ తల్లిదండ్రులు కూడా అప్పులపాలు కాకూడదన్నదే నా ఆశ. నా 3468 కిలోమీటర్ల పాదయాత్రలో కష్టాలను చూశాను. పేదవాళ్లు పడుతున్న బాధలు విన్నాను. చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశాను. చదువుకు అయ్యే ఖర్చులు భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి చూశాను. ఈ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పును తీసుకొస్తానని ఆ రోజు మాటిచ్చాను. మీ పిల్లల చదువులు ఇకపై నేను తీసుకుంటానని మాటిచ్చాను. ఈ రోజు ఆ మాట నిలబెట్టుకొనే రోజు వచ్చింది. ఇందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి తల్లికి, చెల్లికి ఒకే ఒక్క మాట చెబుతున్నాను. మీపిల్లలను బడులకు పంపించండి. ఏ బడికి పంపించిన ఫర్వాలేదు. కేవలం పిల్లలను బడికి పంపించడమే. బడికి పంపిస్తే చాలు ఈ రిపబ్లిక్‌ డే నాటికి జనవరి 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ దినం చేస్తాం. ఆ రోజు పిల్లలను ఎవరైతే బడులకు పంపిస్తారో ప్రతి తల్లి చేతిలోనూ రూ.15 వేల డబ్బులు పెడతాం. ఈ రోజు ఏ తల్లి కూడా తమ పిల్లలను చదివించేందుకు అవస్థలు పడకూడదు. ఈ రోజు ఏపీలో అక్షరాల 33 శాతం మందికి చదువు రావడం లేదు. చదువుకోలేని పరిస్థితి. భారత దేశంలో యావరేజ్‌ చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం 26 శాతం ఉంది. మన రాష్ట్రంలో 33 శాతం ఉంది. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ రోజు మన పిల్లలు ఉన్నారని గ్రహించాలి.

ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నామని నా పాదయాత్రలో చూశాను. పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందడం లేదు. ఏప్రిల్, మే మాసంలో పుస్తకాలు అందాలి. స్కూల్‌ ఓపెన్‌ అయిన వెంటనే పుస్తకాలు అందించాలి. స్కూల్‌ తెరిచిన వెంటనే మూడు జతల యూనిఫాం అందజేయాలి. మన ఖర్మ ఏంటంటే..నా పాదయాత్రలో గమనించా..పిల్లలకు సెప్టెంబర్‌ దాటిన కూడా పుస్తకాలు అందలేదు. యూనిఫాం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. టీచర్ల ఉద్యోగాల కొరత ఉన్నా రిక్రూట్‌మెంట్‌ చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తే ఆ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మరుగుదొడ్లు ఉండవు. నీరు ఉండదు. ఫ్యాన్‌ లేదు. కంపౌండువాల్‌ ఉండదు. ఇక పిల్లలను చదివించాలంటే ఏ తల్లైనా భయపడాల్సిందే. ప్రైవేట్‌ రంగంలో స్కూళ్లలో ఫీజులు షాక్‌ కొడుతున్నాయి. నారాయణ, శ్రీ చైతన్య వంటి స్కూళ్లలో ఫీజులు విఫరీతంగా వసూలు చేస్తున్నారు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితి ఉన్నప్పుడు మన పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్చేస్తానని మాటిస్తున్నాను. ఇక్కడికి రాకముందు రీవ్యూ కూడా తీసుకున్నాను.  ఇవాళ ప్రతి స్కూల్‌ను కూడా ఫోటో తీయండి.

రాష్ట్రంలో 40 వేల స్కూళ్లు ఉన్నాయి. స్కూల్‌ ఎలా ఉన్నాయో చూడండి. రెండేళ్లలో అదే స్కూళ్లు ఎలా ఉన్నాయో చేసి చూపిస్తాం. పాఠశాలలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ప్రైవేట్‌ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నాను. ప్రతి స్కూల్‌ కూడా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతాం. దేశంతో పోటీ పడుదాం. ప్రతి స్కూల్‌లోనూ తెలుగు సబ్జెట్‌ను తప్పని సరి చేస్తాం. ఈ రోజు చదువుల విప్లవాన్ని తీసుకువస్తాం. మంచి స్కూళ్లుగా తీర్చిదిద్దుతాం. ఏ తల్లి కూడా అవస్థలు పడకుండా చేస్తాం. ప్రతి తల్లికి అన్నగా తోడుంటాను. మీ పిల్లలను బడికి పంపించండి. నేనున్నాను.. ఆ పిల్లలకు మామగా ఉంటాను. ఈ స్కూళ్ల పరిస్థితి మారాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి స్కూళ్ల బాట పట్టమని అందరికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ముగిస్తున్నాను.
 

Back to Top