తాడేపల్లి: ``ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాపై నమ్మకం ఉంచి రెండోసారి రాజ్యసభకు పంపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. వైయస్ జగన్, వైయస్ భారతమ్మకు నేను మసస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను`` అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, రాష్ట్ర సమస్యలను పార్టీ పరంగానూ, సీఎం మనసులోని ఆకాంక్షలకు అనుగుణంగానూ నడుచుకుంటూ, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని తెలిపారు. రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల విజయసాయిరెడ్డి ఆనందం వ్యక్తం చేస్తూ.. సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఏమన్నారంటే.. ఇప్పుడు రాజ్యసభలో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు బీసీలు. నాన్ బీసీల్లో నేను రిటైర్ అవుతుండగా, మిగతా వారు నలుగురు ఉంటారు. ఇప్పుడు ఎన్నిక కాబోతున్న నలుగురిలో ఇద్దరు బీసీలు. వచ్చే నెల నాటికి రాజ్యసభలో మొత్తం 9 మంది వైయస్ఆర్ సీపీ సభ్యులు ఉంటే, వారిలో 5గురు బీసీలు ఉంటారు. దీన్ని బట్టి బీసీలకు సీఎం వైయస్ జగన్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. బీసీ. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు, బడుగు, బలహీనవర్గాలకు వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు ఇస్తున్న ప్రాధాన్యత, వారికి సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా నడిపించాలన్న ఆయన ఆకాంక్ష స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నేత. ఆయనకు అపార అనుభవం ఉంది. ఇక్కడ ప్రాంతం అని చూడకుండా, బీసీలను మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగానూ, రాజకీయంగానూ, సామాజికంగానూ ఉన్నత స్థానంలో పెట్టాలన్న ఆశయం మేరకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు పార్టీ నుంచి ఎంపిక చేసిన వారు రాష్ట్రానికి సంబంధించిన వారా? కాదా? అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. వారు బడుగు, బలహీనవర్గాల ప్రయోజనాలు కాపాడతారా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలరా?. వారు రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతారు అన్నటు వంటిదే ఇక్కడ ప్రధానం. మా సీఎం చాలా సరైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంలో ఏ మాత్రం తప్పులేదు.