తాడేపల్లి: రాష్ట్రంలోని బార్లలో ప్రభుత్వ మద్యం విక్రమయాలు జరగడం లేదని, సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు బార్ల నుంచి నెలకు రూ.5 కోట్లు కమీషన్లు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపణలపై సూటిగా సమాధానం చెప్పే ధైర్యం లేక వైయస్ఆర్సీపీహయాంలో విధ్వంసం అంటూ అదే పాత పాట పాడుతున్నారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల కూటమి పాలనలో అప్పులు తెచ్చి బినామీలకు పనులు అప్పగించడం, వారి నుంచి కమీషన్ల పేరుతో వెనక్కి తీసుకొవడం తప్ప అభివృద్ధి ఆనవాళ్లు కనిపించడం లేదని ఆరోపించారు. వైయస్ఆర్సీపీహయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితే డాక్టర్లు కావాలన్న పేద విద్యార్థుల కలను భూస్థాపితం చేసేసినట్టేనని, వాటిల్లో పేదలకు ఉచిత వైద్యం అనేది అందని ద్రాక్షగా మారిపోతుందని చెప్పారు. వైయస్ఆర్సీపీ హయాంలో పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా వైయస్ జగన్ గారు ప్రతి రూపాయిని బాధ్యతగా ఖర్చు చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లో చేసిన రూ. 2.66 లక్షల కోట్ల అప్పులకు లెక్కులున్నాయా అని వంగవీటి నరేంద్ర సూటిగా ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి రాష్ట్రంలోని బార్లలో అక్రమంగా తీసుకొచ్చిన మద్యం విక్రయిస్తున్నారని, అక్కడ బార్లలో జరుగుతున్న మద్యం విక్రయాల ఆదాయం ప్రభుత్వ ఖజానాకి రావడం లేదని, బార్ల యాజమాన్యాల నుంచి రూ. 5 కోట్ల చొప్పున వసూలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం కమీషన్ల రూపంలో సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జేబుల్లోకి పోతోందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రమైన ఆరోపణలతో ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. దీంతోపాటు వైయస్ఆర్సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణం.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో వాటిని మూలన పడేసిన వైనంపైన ప్రశ్నించారు. దీనిపై ప్రెస్మీట్ పెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర.. మాజీ మంత్రి పేర్ని నాని గారు చేసిన ప్రధాన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వైయస్ఆర్సీపీహయాంలో అలా అయింది, జగన్ అలా చేశాడు అంటూ అసలు విషయం తప్ప ఏవేమో మాట్లాడేసి వెళ్లిపోయాడు. టాపిక్ డైవర్షన్ తప్ప, వైయస్ఆర్సీపీ నాయకులు అడిగే ఏ ప్రశ్నలకూ సూటిగా సమాధానం చెప్పే సత్తా కూటమి నాయకులకు ఉండటం లేదు. వైయస్ జగన్ గారి పాలనలో రాష్ట్రం నాశనం అయిపోయిందని ప్రచారం చేస్తున్న కూటమి నాయకులు.. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినందుకా, గ్రామ సచివాలయాల ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినందుకా, నాడు-నేడు ద్వారా స్కూల్స్ను బాగుచేసినందుకా, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు కట్టినందుకు నాశనమైందా చెప్పాలి. ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతుకి విత్తు నుంచి విక్రయం ద్వారా అండగా నిలిచినందుకు నాశనమైందా చెప్పాలి. కూటమి నాయకులు చంద్రబాబు ఇచ్చిన పచ్చ కళ్లద్దాలను తీసేసి చూస్తేనే వాస్తవ పరిస్థితులు కనిపిస్తాయి. మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షే కనీసం మంత్రి కొల్లు రవీంద్ర వైయస్ఆర్సీపీహయాంలో తన నియోజవర్గంలో నిర్మాణం జరుపుకొన్న మచిలీపట్నం పోర్టు పనులను చూసి ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు కాదు. ఆచరణ సాధ్యం కాని అమరావతికి ప్రత్యామ్నాయంగా వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్ ఐడియాతో రాష్ట్రం రూపురేఖలు మారిపోతాయని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. కానీ రాజధాని ముసుగులో అవినీతికి అలవాటుపడ్డ చంద్రబాబు దీన్ని ఓర్చుకోలేక వివేకా మర్డన్ ను తీసుకొచ్చి తప్పుడు ప్రచారంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కూటమి వచ్చిన రెండేళ్లలో స్కీముల పేరుతో స్కాములు తప్ప సూపర్ సిక్స్లో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. దేశంలో వెన్నుపోటుకి చంద్రబాబుకి పేటెంట్ ఉంది. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఓటేసిన ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచాడు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సిద్దార్థ కాలేజీకి 50 ఏళ్ల క్రితం కనకదుర్గమ్మ అమ్మవారి భూములు లీజుకిచ్చినా, ఇప్పటికీ ఆ కాలేజీల్లో పేద విద్యార్థులెవరికీ ఉచితంగా సీటు దొరికే అవకాశమే లేదు. టీడీపీ నాయకులు సిఫార్సులు ఉంటే తప్ప సీటు దొరికే పరిస్థితి ఉండదనేది ఓపెన్ సీక్రెట్. అలాంటిది మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో చంద్రబాబు ప్రైవేటుకి దారాదత్తం చేస్తే పేద రోగులకు కనీసం దాని మొహం కూడా చూసే అవకాశం ఉండదు. డాకర్లు కావాలన్న తెలివైన పేద విద్యార్థుల కలలకు గండి కొట్టడం కోసమే పీపీపీ నిర్ణయం తీసుకొచ్చారు. రెండేళ్లలో అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం 23 నెలల్లోనే రూ. 2.66 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు పూర్తి కావొచ్చిన దశలో ఉన్న మెడికల్ కాలేజీలు, రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. కానీ అమరావతిలో బిల్డింగులకు గ్లాసులు బిగించడానికి రూ. 2,540 కోట్లు, పిచ్చి మొక్కలు పీకించడానికి రూ. 400 కోట్లు, వర్షపు నీళ్లు తోడటానికి రూ. 1200 కోట్లు, యోగాంధ్ర పేరుతో చేసిన పబ్లిసిటీకి రూ.300 కోట్లు ఖర్చు చేశారు. పేదలకు విద్య, వైద్యం కోసం ఖర్చు చేయాల్సింది పోయి ఆచరణ సాధ్యం కాని, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని అమరావతి రాజధాని పేరుతో దుబారా చేస్తున్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో ఖర్చు చేసిన ప్రతిరూపాయికి లెక్క ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి వైయస్ జగన్ గారు ప్రతి రూపాయినీ బాధ్యతగా ఖర్చు చేశారు. రెండేళ్లపాటు కరోనా విలయతాండవం చేసినా ప్రజలను అక్కున చేర్చుకుని ఆదుకున్నారు. వైయస్ఆర్సీపీ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్లు చేయడం తప్ప అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా తేలేకపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. రాష్ట్రంలో క్రైమ్ రేటు మూడింతలు పెరిగింది. మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. లా అండ్ ఆర్డర్ విభాగాన్ని నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, విద్యారంగాన్ని చూస్తున్న లోకేష్లు వారి శాఖలను పూర్తిగా భ్రష్టుపట్టించారు. మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు బాధ్యతలను నెరవేర్చకుండా అబద్ధాలు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. రానున్న రోజుల్లో వారికి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.