తాడేపల్లి: డాక్టర్ వైయస్ఆర్ సంచార పశు వైద్య సేవల అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో 340 పశువుల అంబులెన్స్లను ఏర్పాటు చేస్తుండగా.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్లను క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనాల సదుపాయాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం డాక్టర్ వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్యసేవల అంబులెన్స్లను ఏర్పాటు చేసింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ అంబులెన్స్లను తీసుకొచ్చారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబరు 1962 ఏర్పాటు చేశారు. అంబులెన్స్లో సౌకర్యాలు.. - ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. - 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్తో కూడిన చిన్న ప్రయోగశాల. - అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతోపాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం - ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు ఏర్పాట్లు - అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్స చేసే సౌలభ్యం.