తాడేపల్లి: ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి వాల్మీకి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అంటూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో సందేశం పంపించారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషా శ్రీచరణ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీనియర్ నేతలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, బి.వై.రామయ్య తదితరులు పాల్గొన్నారు.