కృష్ణాజిల్లా: పోలవరం ఆయకట్టు పరిధిలో సాగు చేస్తున్న రైతుల సమస్యలను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తమ మోటార్లను తొలగించి, ఆయకట్టు కింద వ్యవసాయం చేయవద్దని చెబుతోందంటూ రైతులు వంశీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లుగా పోలవరం ఆయకట్టుపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నామని రైతులు తెలిపారు. ఇప్పటికే ఎకరాకు సుమారు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెబితే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కృష్ణా డెల్టా నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని, వరి సాగు మానుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగుకు నీరు అందించలేని పరిస్థితి ఉంటే పంటలు వేసే ముందే ఎందుకు చెప్పలేదని నిలదీశారు. రైతుల సమస్యలను విన్న వల్లభనేని వంశీ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రైతుల సాగునీటి అవసరాల కోసం తన సొంత ఖర్చుతో మోటార్లు కొనుగోలు చేసి అందించిన విషయాన్ని రైతులు గుర్తుచేశారు.