అత్యుత్తమ వైద్య సేవలు అందించేలా శ్రీబాలాజీ క్యాన్సర్ ఆస్ప‌త్రి నిర్మాణం

దసరాకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేలా చ‌ర్య‌లు 

ఆస్ప‌త్రి నిర్మాణంపై టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స‌మీక్ష‌

తిరుప‌తి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ఆదేశాల మేర‌కు దేశంలోనే అత్యుత్తమ చికిత్సలు అందించేలా  తిరుపతిలో శ్రీబాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (క్యాన్సర్ ఆస్ప‌త్రి) నిర్మిస్తున్నామని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది దసరాకు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా ఆస్ప‌త్రిని ప్రారంభిస్తామ‌న్నారు. క్యాన్సర్ ఆస్ప‌త్రి నిర్మాణ‌ ప్రగతిపై స్విమ్స్ లో శుక్రవారం ప్రముఖ వైద్యులు, అధికారులతో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. పేద పిల్లలు గుండె వ్యాధులతో చనిపోకుండా ఉండాలనే లక్ష్యంతో తిరుపతిలో చిన్న పిల్లల గుండె చికిత్సల ఆస్ప‌త్రి  నిర్మించాలని సీఎం ఆదేశించార‌న్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఈ ఆసుపత్రి పేదలకు గొప్ప వైద్య సేవలు అందిస్తుందని ముఖ్యమంత్రి విశ్వసించారని అన్నారు. ఆలోచన వచ్చిన నాలుగు నెలల్లోనే తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి హృదయాలయం ఏర్పాటు చేయించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారన్నారు. ఇప్పటివ‌ర‌కు వెయ్యి మందికి పైగా పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసి వారికి కొత్త జీవితం ప్రసాదించామ‌ని చెప్పారు. 

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర‌ప్రదేశ్‌లో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి లేనందువల్ల తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోనే ఆసుపత్రి నిర్మించాలని ముఖ్యమంత్రి తమను ఆదేశించారని, రూ. 350 కోట్లతో సకల సదుపాయాలతో దేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించే చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా బర్డ్‌లో ఉచితంగా గ్రహణమొర్రి, కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసేలా ఏర్పాటు చేశారన్నారు. ఈ ఆపరేషన్ల వేగం పెంచేలా తరచూ తమకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

క్యాన్సర్ తో రాష్ట్రంలో ఏ ఒక్కరు మరణించరాదనే ఉద్దేశంతో రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు-విజయవాడ మధ్య, విశాఖపట్నం లో క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ నిర్ణయించారన్నారు. ఇందుకోసం క్యాన్సర్ చికిత్సల ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును సలహాదారుగా నియమించారన్నారు. శ్రీవారి ఆశీస్సులతో మొదటి ఆస్పత్రి తిరుపతిలో నిర్మించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. స్విమ్స్ అనుబంధంగా శ్రీబాలాజీ క్యాన్సర్ ఆస్ప‌త్రి నిర్మాణానికి పూనుకున్నట్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ఆర్కిటెక్చర్లు, క్యాన్సర్ నివారణకు వివిధ మార్గాల్లో పనిచేస్తున్న ప్రముఖులు, వైద్యులు, అధికారులకు చైర్మన్ వివరించారు. ప్రస్తుతం స్విమ్స్ లో ఉన్న భవనాన్ని క్యాన్సర్ ఆస్ప‌త్రికి అవసరమైన విధంగా మార్పులు చేయడం,   యంత్రాలు, వైద్య పరికరాలు సమకూర్చుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన డీపీఆర్ తయారు చేసి సమర్పించాలని చైర్మన్ కోరారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించడం, తొలిదశలోనే గుర్తించడం, ఉత్తమ చికిత్సలు అందించి ప్రాణాలు కాపాడటం అనే అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్విమ్స్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆస్ప‌త్రి భవనాలు, ఇంజినీరింగ్ పనులు, డిజైన్ల ఖరారు లాంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి దసరాకు ఆస్ప‌త్రి ప్రారంభిచేలా వర్క్ ప్లాన్ చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవికి సూచించారు. ప్రతి పని గడువు విధించుకొని పూర్తి చేయాలని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి  ఆదేశించారు.
 

Back to Top