ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

 ఏపీ హోంమంత్రి సుచరిత 
 

గుంటూరు: నివర్ తుపాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి సుచరిత సూచించారు.  విపత్తు నిర్వహణ, పోలీసు అధికారులను అలెర్ట్ గా ఉండాలని ఆమె ఆదేశించారు. తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు.
 
ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి ఎప్పటికప్పుడు ఫోన్ లో సుచరిత వివరాలు తెలుసుకుంటున్నారు. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప, గుంటూరు జిల్లాలలో వర్షాలు పడుతున్నాయని ఆమెకు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీట మునిగినట్లు హోంమంత్రి కి వివరించారు. వర్షాల అనంతరం పంటల నష్టాన్ని అంచనా వేయాలని సుచరిత సూచించారు.

కాగా, ఏపీలోని చిత్తూరులో నివర్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. మల్లిమడుగు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. తిరుపతి రేణిగుంట దగ్గర కుమ్మరలోపు చెరువుకు వరద ఉద్ధృతి పెరిగింది.  రేణిగుంట ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరుచేరింది.

Back to Top