గుంటూరు: కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవస్థీకృత టెర్రరిజాన్ని క్రియేట్ చేస్తుస్తోందని, మహిళల పట్ల పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదని, రేపు మేం అధికారంలోకి వచ్చి ఇలాగే మొదలుపెడితే ఎలా ఉంటుందంటూ చంద్రబాబు సర్కార్కు వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు సీఐడి కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి అక్రమ కేసులో విచారణకు పిలిచారని.. బాధ్యత కలిగిన పౌరుడిగా విచారణకు వచ్చానని తెలిపారు. గతంలో కూడా ఒకసారి విచారణకు వచ్చానని చెప్పారు ప్రజాస్వామ్యంలో పట్టాభిలాగా బూతులు మాట్లాడరు. టీడీపీ నాయకుడు పట్టాభి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునని సజ్జల అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఆరోపణలపై పోలీసుల దర్యాప్తునకు సహకరించాలనే ఉద్దేశంతో బాధ్యతగల పౌరుడిగా సీఐడీ కార్యాలయానికి రావడం జరిగింది. దాడి జరిగిన సమయంలో నేను ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. ఈ విషయం గతంలో విచారణకు హాజరైనప్పుడే చెప్పడం జరిగింది. ఈరోజు కూడా విచారణ సందర్భంగా నన్ను అడిగినప్పుడు మళ్లీ ఇదే విషయం చెప్పాను. దానికి సంబంధించిన ఆధారాలు గతంలోనే పోలీసులకు కూడా అందజేయడం జరిగింది. మీ సూచనల ప్రకారమే జరిగిందా అని అడినప్పుడు.. కోట్ల మంది ప్రజాభిమానం ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ నాయకుడు పట్టాభిలాగా ఆయనను అసభ్యంగా దూషించడంపై చాలా ఆవేదన కలిగింది. ఆక్రోశం వచ్చింది. అంత అసభ్యకరంగా చెప్పలేని రీతిలో మాట్లాడినప్పుడు దీనికోసమా రాజకీయాల్లో ఉన్నాం అనే బాధ కలిగింది. కానీ దాడులకు ప్రతిదాడులే పరిష్కారం అని మాత్రం ఎప్పటికీ మేం అనుకోలేదు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతిమాటను ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇరువర్గాలు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. తెలిసిన విషయాలు ఏవైనా ఉంటే చెప్పమని అడిగారు. మీరు అడిగేవన్నీ నాకు తెలియదని చెప్పాను. మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా రావడానికి సిద్ధమేనని చెప్పాను. కేసు విచారణకు సంబంధించి జరిగిందంతా ఇదే. అక్రమ కేసులు బనాయించడమ వారి లక్ష్యం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రెడ్ బుక్ పాలన పేరుతో వేధింపులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రెడ్ బుక్ పేరుతో మరీ ఇంత దారుణంగా వ్యవస్థలన్నింటినీ తద్వారా రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారనుకోలేదు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు రాక ముందు నుంచే మొదలైన కూటమి నాయకుల దాడులు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత పథకం ప్రకారం ప్రణాళికబద్ధంగా జరుగుతున్నాయి. నచ్చని వ్యక్తులు, నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారు. సంఘటన స్థలంలో ఉన్నాడో లేడో కూడా వారికి అనవసరం. తప్పుడు కేసు నమోదు చేయడం, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు పంపడం. తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేయడం.. 11 నెలలుగా ఏ కేసు చూసినా జరుగుతున్న వ్యవహారం మొత్తం ఇలాగే ఉంది. సీఎం చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు.. వారికి ఎవరి మీద కోపమున్నా వారి మీద కేసులు పెట్టి లోపలెయ్యడమే వారి ధ్యేయం. ఏ రిమాండ్ రిపోర్టు చూసినా నిందితుడిగా ఉన్న వ్యక్తికి, వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తికి కనీసం ముఖ పరిచయం కూడా ఉండదు. మరీ దారుణంగా పోసాని కృష్ణ మురళి విషయంలో పదేళ్ల క్రితం పెట్టిన సోషల్ మీడియా పోస్టును చూపించి అర్థరాత్రి అరెస్ట్ చేసి వేధించారు. ఉన్నాదంతో రెచ్చిపోతున్నారు రాంరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి మా హయాంలోనే కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక టీడీపీ వ్యక్తి పెట్టిన కేసును ఇప్పుడు తిరగదోడి కొత్తగా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈరోజు వేకువజామున 3 గంటల సమయంలో మా పార్టీకి చెందిన దళిత మహిళ, కంతేరు ఎంపీటీసీ కల్పనను 20 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ అనే కనీస గౌరవం లేకుండా నైటీలో ఉన్న ఆమె దుస్తులు మార్చుకోవాలని వేడుకున్నా వినకుండా చట్టవిరుద్ధంగా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి కూటమి నాయకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళ విషయంలో వ్యవహరించాల్సిన రీతిలో కూడా పోలీసులు నడుచుకోవడం లేదు. న్యాయాన్యాయాలను పక్కనపెట్టి దిగజారి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వ్యవస్థలను దుర్వినియోగం చేసి అడ్డదారులు తొక్కుతున్నారు. మీడియా వ్యవస్థకున్న గౌరవాన్ని కూడా కాలరాస్తున్నారు. జరగని లిక్కర్ స్కాంలో అక్రమ అరెస్టులు చేయడమే తప్పని ప్రశ్నిస్తుంటే.. అంతటితో ఆగకుండా రిటైర్డ్ ప్రభుత్వ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి కోసం అన్నట్టు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంట్లో అనుమతులు తీసుకోకుండా అక్రమంగా సోదాలు నిర్వహించారు. ఒక పెద్ద మీడియా సంస్థ ఎడిటర్ అనే ఇంగితం కూడా లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఇంకెత కాలం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలంటేనే ఆలోచించాలనే విధంగా భయాందోళన సృష్టించడమే వీరి ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ఇలాగే వ్యవహరించి ఉంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బతికుండేదా? రేపు మేం అధికారంలోకి వస్తే వారి పట్ల ఎలా ఉండాలో వీళ్లు నేర్పిస్తున్నట్టుగా ఉంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని వీళ్లు గుర్తుంచుకోవాలి. ఇదే పని మేం మొదలుపెడితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వారి ఊహకే వదిలేస్తున్నాం. వేధింపులు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులతో వైయస్సార్సీపీ కార్యకర్తలను అణగదొక్కాలనుకుంటే అంతకన్నా అవివేకం ఉండదు. మా కార్యకర్తలంతా పోటెత్తితే రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవు. డైవర్షన్ పాలిటిక్స్ తో ఎంతోకాలం ప్రజల దృష్టిని మళ్లించలేరు. ఏడాది పాలనతో చేసిన డైవర్షన్ పాలిటిక్స్ చూసి ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు. నాలుగు మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది.