అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా వైయ‌స్ జ‌గ‌న్‌ పాలన

అణగారిన వర్గాల అభ్యున్నతికి శ్రమిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రాజ్యాంగంలో నిర్దేశించిన అంశాలు కార్యరూపం

ఆ దిశలోనే మూడున్నర ఏళ్లుగా ప్రభుత్వ పరిపాలన

విద్య, వైద్య రంగాలలో సమూల మార్పులు

ఉన్నత ప్రమాణాలతో ప్రభుత్వ స్కూళ్లలో విద్యాబోధన

వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా గణతంత్ర దినోత్సవం 

పాల్గొన్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల‌ రామకృష్ణారెడ్డి, ముఖ్య నేత‌లు

తాడేపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంత‌రం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వంద‌నం చేశారు. అనంత‌రం ప్రజలకు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..

భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించి నేటితో 73 ఏళ్లు పూర్తయ్యాయి. ఆనాడు అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమానత్వానికి దిక్సూచిలా పని చేస్తోంది. ఈ ప్రయాణంలో 74 ఏట అడుగు పెట్టడం ప్రతి భారతీయుడు గర్వించాల్సిన అంశం. సర్వసత్తాక, సార్వభౌమ దేశంగా కోటి ఆకాంక్షలతో భారతదేశం అవతరించడమే కాకుండా, ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తోంది. బ్రిటీష్‌ పాలన నుంచి విముక్తి పొంది అభివృద్ధి, అభ్యుదయం ఎలా ఉండాలి అన్నది ఆచరణలో చూపుతోంది. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ఉంటూ వివిధ వర్గాలు, భిన్న జాతులు, ఎన్నో భాషలు ఉన్న మన దేశంలో ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలతో మనగలుగుతున్నారు.

ఇప్పటివరకు వివక్షకు గురైన వారు, పేదరికంలో మగ్గుతున్న వారు, అణగారిన వర్గాలు తమ తలరాతలు తామే రాసుకునే విధంగా, తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఆనాడు అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఏదైతే నిర్దేశించారో ఆ విధంగా ఇవాళ రాష్ట్రంలో సీఎం వైయస్‌ జగన్‌ పాలన అందిస్తున్నారు. ఆ వర్గాలు భవిష్యత్తులో కూడా ఏ విధంగానూ ఇబ్బంది పడకుండా వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే ప్రక్రియ రాష్ట్రంలో ఈ మూడున్నర ఏళ్లుగా కొనసాగుతోంది. ఆ దిశలోనే సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. 

ఆధునిక కాలంలో విద్య అనేది అత్యంత ప్రధానమైన అంశం. అందుకే ఆ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం వైయస్‌ జగన్, ఆ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేశారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మార్చేస్తున్నారు. వేల కోట్లతో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తులో మరిన్ని మార్పులు తథ్యం. వాటిని మరింతగా సద్వినియోగం చేసుకునే దిశగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అడుగులు వేస్తే.. ఆశించిన లక్ష్యాలను వేగంగా సాధించవచ్చు.

నిరుపేదలకు కూడా ఖరీదైన వైద్యాన్ని అందించడంపైనా సీఎం వైయస్‌ జగన్‌ దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేయడంతో పాటు, గ్రామ స్థాయిలో కూడా ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆ విధంగా ఆనాడు మహనీయులు రాజ్యాంగ రచన సమయంలో ఏ కలలైతే కన్నారో.. వాటిని సాకారం చేయడంలో సీఎంగారు నిరంతరం శ్రమిస్తున్నారు. చిత్త«శుద్ధితో పని చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు, వారిని అభివృద్ది వైపు నడిపించడంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని  సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, గ్రంధాలయ పరిషత్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, నవరత్నాల అమలు ప్రోగ్రామ్‌ వైస్‌ ఛైర్మన్‌ నారాయణమూర్తి, లిడ్‌క్యాప్‌ ఛైర్మన్‌ కాకుమాను రాజశేఖర్, గుంటూరు డిప్యూటి మేయర్‌ శ్రీమతి సజిల, పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top