తాడేపల్లి: పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే, ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేటి నుంచి 45 రోజుల పాటు విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమం పోస్టర్ను వైయస్ఆర్సీపీ నాయకులు ఆవిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి గ్రామ స్థాయి వరకూ వైయస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం చేపడుతుంది. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేతృత్వంలో గవర్నర్ కు కోటి సంతకాలను సమర్పిస్తారు.