తాడేపల్లి: యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తూ, రాష్ట్ర మంతా సరఫరా చేస్తూ.. పూర్తి ఆధారాలతో సహా తమ పార్టీ నాయకులు పట్టుబడినా, ఇప్పటి వరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు నాయుడు, హఠాత్తుగా ఈ కేసుపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని మాజీ మంత్రులు కె.నారాయణ స్వామి, కాకాణి గోవర్థన్ రెడ్డి ఆక్షేపించారు. కేవలం నిజాలు సమాధి చేయడానికి, కేసును నీరు గార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. గత ఏడాది సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు వేసిన సిట్ లన్నీ కేవలం కక్ష సాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమే అని గుర్తు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్ రెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో మాజీ మంత్రులు ఏమన్నారంటే..: రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా కుటీర పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి, నకిలీ మద్యం తయారు చేస్తూ, దాన్ని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో సహా టీడీపీ నేతలు పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడు? నిజానికి ‘సిట్’ అనేది చంద్రబాబు జేబులో సంస్థ. మేం డిమాండ్ చేస్తున్నట్లు సీబీఐ దర్యాప్తు కోరకుండా, సిట్ ఏర్పాటు చేయడమంటే.. తాము తప్పు చేశామని చంద్రబాబు అంగీకరించినట్లే కదా?. రాష్ట్రంలో ఇప్పుడు నకిలీ మద్యం అనేది ఏదో, ఎక్కడో ఒకచోట బయటపడలేదు. దాన్ని పక్కాగా వ్యవస్థీకృతంగా లిక్కర్ మాఫియా నడుపుతోంది. ఆ మాఫియాలో ఉన్న వారంతా టీడీపీ నాయకులే. నిజానికి పెదబాబు, చినబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది. మరి తన హయాంలో అంత యథేచ్ఛగా నడుస్తున్న ఆ రాకెట్పై తానే సిట్ వేయడం హాస్యాస్పదం. నిజానికి మొలకలచెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్షాప్పై ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదు. పర్మిట్రూమ్లు, బెల్టు షాప్లను కనీసం తనిఖీ చేయలేదు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమైంది. ఇంత జరిగినా కూడా, ఇప్పుడూ గత మా ప్రభుత్వంపైనే చంద్రబాబు బురద చల్లుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూర్ కోడ్, స్కానింగ్ వైయస్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారు. అప్పుడు ప్రభుత్వమే వైన్షాప్లు నడపడం వల్ల, ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పోయింది. కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక, గత ప్రభుత్వ మద్యం విధానాలన్నింటినీ రద్దు చేసి, మద్యం షాప్లన్నింటినీ ప్రైవేటుపరం చేశారు. వాటన్నింటినీ తమ మాఫియా ముఠా చేతుల్లో పెట్టారు. తమ పార్టీ వారికే మద్యం షాపులను ఇచ్చి, వాటికి పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. చివరకు బెల్టు షాపులను కూడా మద్యం మాఫియా చేతుల్లో పెట్టారు. అంటే నకిలీ మద్యం వాళ్లే తయారు చేస్తారు. వాళ్ల మద్యం షాపులు, బెల్టుషాప్లకు తరలించి అమ్మేస్తారు. ఇదే స్పష్టంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం దందా ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో, ప్రజల ముందు దోషిగా నిలబడిన సీఎం చంద్రబాబు, కేసు డైవర్షన్ కోసం ఈ సిట్ డ్రామాకు తెర లేపారు. ఈ దందాలో ఆయనకు ఏ మాత్రం ప్రమేయం లేకపోయినా, కేసుపై కొంతైనా చిత్తశుద్ధి ఉంటే, మా పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు, నకిలీ మద్యంపై సిట్తో కాకుండా, సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అలా తన నిర్దోషిత్వాన్ని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్షాప్ల్లో వెంటనే తనిఖీలు చేయాలి. ఏది అసలు మద్యమో, ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలి. ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలి. ఎక్సైజ్ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇంకా జయచంద్రా రెడ్డితో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ మద్యం దందా నడిపించిన కిలారు రాజేష్ ద్వారా ముడుపులు అందుకున్న లోకేష్ పైనా సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం ఏర్పడుతుందని ఆ ప్రకటనలో మాజీ మంత్రులు కె.నారాయణ స్వామి, కాకాణి గోవర్థన్ రెడ్డి తేల్చి చెప్పారు.