చిత్తూరు: నారా వారి సారా పాలన నశించాలని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా నినదించారు. వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు సోమవారం కల్తీ మద్యంపై చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నగరి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నారావారి సారా పాలన నశించాలంటూ ఆమె నినాదాలు చేశారు. అంతకముందు మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం నుంచి నగిరి ఎక్సైజ్ కార్యాలయం వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘ప్రజలకు మద్యాన్ని దూరం చేసి ప్రజల ఆరోగ్యాన్ని వైయస్ జగన్ కాపాడారు. ఏపీలో 43వేల బెల్ట్ షాపులు తొలగించారు. మద్యం దుకాణాలను మూసేశారు. కానీ, టీడీపీ నాయకుల మాత్రం డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారు. ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం. ఎన్డీయే అంటే దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కల్తీ మద్యం తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ రూము ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు?. సిగ్గులేకుండా డైవర్షన్ పాలిటిక్స్ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పైనుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నారు. ఈ రోజు సాక్ష్యాలతో సహా దొరికిపోయారు. ఏ జిల్లాలో చూసినా మన మొలకలచెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా కట్టే పరిస్థితి కాదు. ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెడిపేస్తూ వాళ్ళ మంగళ సూత్రాలను మట్టిలో తొక్కేస్తూ సిగ్గులేకుండా మళ్ళీ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నకిలీ మద్యం నియంత్రించాలని, కల్తీ మద్యంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలి` అని రోజా డిమాండ్ చేశారు.