శ్రీకాకుళం: చంద్రబాబు మన జిల్లా కోసం ఏం చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఎన్నికల అనంతరం చంద్రబాబు మర్చిపోతారు, ఆయన్ను నమ్మకండి నమ్మి మోసపోకండి అన్నారు. ఇరవై లక్షలు కాదు 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేవు, పద్నాగేళ్లూ ఏం చేశావు బాబు అంటూ నిలదీశారు. పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదే అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని 22వ డివిజన్ లో రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మడ్డి వీధి, చిన్న బొందిలీపురం,పెద్ద బొందిలీపురం,హరిజన వీధి తదితర ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఐదేళ్ల పాటూ మా ప్రభుత్వం అందించిన పాలన చూశారు. పొందిన సౌకర్యాలు,చేసిన అభివృద్ధి ఏంటన్నది మీకు తెలుసు. ప్రభుత్వం అందించిన పాలనతో సామాన్యులు ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇవన్నీ పేదలకు ఇవ్వడం అవసరమా అని ఒకనాడు విపక్షం గొంతెత్తింది. చంద్రబాబు నాయుడు ఏవేవో అవాకులూ,చెవాకులూ పేలారు. తరువాత రాష్ట్రం దివాలా తీస్తుందని,పథకాల అమలుతో వెనుజులా అవుతుందని,శ్రీలంక అవుతుందని ఏవేవో భయాందోళనలు కల్పించారు. సొంత మీడియా ద్వారా విష ప్రచారం సాగించారు. కానీ యెల్లో మీడియా రాతలను, అబద్ధపు ప్రచారాలనూ ఎవ్వరూ నమ్మే స్థితిలో లేకపోయేసరికి, ఇవాళ వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తాలు కన్నా ఎక్కువ తాను ఇస్తానని, ఆ విధంగా సంక్షేమ పథకాల అమలుకు తాను సిద్ధమేనని అంటున్నారు. కానీ ఆ రోజు 2014 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తాం అన్నారు. కానీ మరిచిపోయారు. డ్వాక్రా సంఘాల రుణాలు (మహిళా పొదుపు సంఘాలు) రద్దు చేస్తాం అని చెప్పారు. బ్యాంకు కు మీ తరఫున మేమే చెల్లిస్తాం అని చెప్పారు. ఆ ఊసు కూడా మరిచిపోయారు. ఇలా అన్ని వర్గాలకూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పాలన సాగించారు. మోసపూరిత ధోరణిలో పాలన సాగించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లలో ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇచ్చాం. నిలువ నీడ కల్పించాం. వారి కలల సాకారానికి ప్రాధాన్యం ఇచ్చాం. మన శ్రీకాకుళం నియోజకవర్గంలో 20 వేల మందికి సొంత ఇళ్లు కట్టుకునేందుకు పట్టాలు ఇచ్చాం. ఇందుకు రూ.500 కోట్లు వెచ్చించాం. పేదల కోసం,దిగువ మధ్యతరగతి వర్గాల కోసం ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నాం. కాలనీలు నిర్మిస్తూ..మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ ప్రభుత్వంలో భాగం అయినందుకు నా రాజకీయం జీవితానికి ఎంతో సంతృప్తి ఉంది. అందుకే నేను జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నాను. మీ అందరి తరఫునా అతను తప్పు చేస్తే తప్పు అని చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను. గెలుపు ఓటములు కావు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామా లేదా అన్నదే ప్రజా జీవితాన ఉన్న ప్రతి ఒక్కరికీ ముఖ్యం. ఈ కోవలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రోజు ఇచ్చిన హామీల పూర్తికి ఈ ప్రభుత్వం చేసిన కృషిలో నేనూ భాగం అయ్యాను. మీ అందరి ఆనందాలకూ ఇవాళ నేను కారణం అయ్యాను అని సగర్వంగా చెప్పగలను. మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అని మా అధినేత అంటున్నారు. అలా అనేందుకు ఎంత దమ్ము ఉండాలి. ఇవాళ ఎందరెందరో కలుస్తున్నారు. వైయస్ జగన్ కు వ్యతిరేకంగా కట్టు కడుతున్నారు. జట్టు కడుతున్నారు. మ్యానిఫెస్టో పేరిట కుటిల కుల రాజకీయాలకు తెర లేపుతున్నారు. ఇవాళ చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలుకుతున్నారు. పద్నాగేళ్లు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కదా..ఎందరికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. వైయస్ జగన్ ఇవేవీ చెప్పలేదు. 4.5 లక్షల ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో ఇచ్చాం. 2.65 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల రూపేణ అందించాం . ప్రభుత్వం తరఫున ఎంతో గౌరవంగా ఆ మొత్తాలను డీబీటీ ద్వారా అందించాం. ఇందులో మధ్యవర్తులకు తావే లేదు. నేరుగా మీ ఖాతాలకు ఆ డబ్బు చేరింది. లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా అత్యంత పారదర్శకంగా పథకాల అమలుకు ప్రాధాన్యం ఇచ్చి,సత్ఫలితాలు అందుకున్నాం. చంద్రబాబ ధనవంతులకు కొమ్ము కాస్తారు. ప్రజాధనం దోచుకుంటారు. వాళ్ల పనే అది. అలాంటి వారికి మనం అధికారం ఇస్తామా ? లేదా ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వానికి అధికారం అందిస్తామా ? ఆలోచించండి. జిల్లాను అభివృద్ధి చేయాలని సంకల్పించాం. 4 వేల కోట్ల రూపాయలతో మూలపేట పోర్టు నిర్మిస్తున్నాం. 400 కోట్ల రూపాయలతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్-ను నిర్మించేందుకు శ్రీకారం దిద్దాం. 900 బెడ్స్-తో జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆస్పత్రిని పునరుద్ధరించాం. ఒక్కసారి గమనించండి ఆ రోజు రిమ్స్ ఆస్పత్రి ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అన్నది ? త్వరలో మన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ స్థానానికి వైయస్ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న పేరాడ తిలక్ ను, ఎంఎల్ఏ గా నన్ను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. 22వ డివిజన్ వైయస్ఆర్సీపీ నాయకులు వండాన గణపతి రావు, పాగోటి నాగభూషణ్ రావు, ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, పట్టణ అధ్యక్షులు సాధు వైకుంఠ రావు, మడ్డి జగదీష్, ప్రతాప్, శివ, బొంతు కిరణ్ కుమార్, శేఖర్, విక్రమ్ దేవ్, జగదీష్, గవర గోవిందరావు, పతివాడ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.