కొత్తగా 2.20 లక్షల పెన్షన్లు

ఆగస్టు 1న పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

తాడేప‌ల్లి: ఈ నెలలో కొత్తగా మంజూరు చేసిన 2,20,385 మందికి కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్‌లకు రూ.51.67 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు. జూలై నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి, వారికి దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే పెన్షన్ మంజూరు కార్డులను అందచేశామన్నారు. 

సంతృప్త స్థాయిలో సామాజిక పెన్షన్లు
ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌‌ పాలనలో తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పుతో రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో సామాజిక పెన్షన్లను అందించగలుగుతున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైయ‌స్ఆర్‌‌ పెన్షన్‌ కానుకను ఆగస్టు 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల చేతికే నేరుగా అందించేందుకు సర్వం సిద్ధం చేశామ‌ని చెప్పారు. ఈ మేరక ఒకేరోజు 61.28 లక్షల మంది పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి, నేరుగా వారి చేతికే పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2.68 లక్షల మంది వాలంటీర్లు పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంద‌న్నారు.  పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.1478.90 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షనర్లకు వారికి అందాల్సిన పెన్షన్‌ మొత్తాన్ని కచ్చితంగా అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారని మంత్రి తెలిపారు.

ఇళ్ల వ‌ద్ద‌కే పింఛ‌న్‌
గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాలకు ఇప్పటికే పెన్షన్ సొమ్మును జమచేశామ‌ని, ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి ల‌బ్ధిదారుల‌కు వాలంటీర్లు ఈ సొమ్మును నేరుగా  అందించనున్నార‌ని తెలిపారు.  గతంలో పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్ద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పడిగాపులు కాసే పరిస్థితిని ప్రభుత్వం పూర్తిగా మార్చేసింద‌న్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నామ‌ని పేర్కొన్నారు.   కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల కూడా పెన్షనర్ల బయోమెట్రిక్‌కు బదులు జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసుకుని, పెన్షన్ అందిస్తారని  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేర్కొన్నారు.
 

నెలకు రూ.2250
గత నెలలో దరఖాస్తు చేసుకున్న వారిలో 1568 మందికి కొత్తగా హెల్త్ పెన్షన్లు కూడా మంజూరు చేశామని వెల్లడించారు.  అలాగే ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మిణ్‌ కార్పోరేషన్ ద్వారా నెలకు రూ.2వేలు ఇస్తున్న పెన్షన్లను కూడా వైఎ​స్సార్‌ పెన్షన్ కానుక కిందకు తెచ్చి, నెలకు రూ.2250 చెల్లిస్తున్నామని తెలిపారు. వాలంటీర్ల ద్వారా వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము వారి చేతికి అందిస్తామని అన్నారు. అలాగే గతంలో కల్చరల్ డిపార్ట్‌మెంట్‌ నుంచి కళాకారులకు అందించే పెన్షన్‌ను కూడా వైఎస్సాఆర్‌ పెన్షన్‌ కానుక కిందకు తెచ్చి, వాలంటీర్ల ద్వారానే అందించబోతున్నామని వెల్లడించారు.

Back to Top