విశాఖ: వ్యాక్సినేషన్లో మన రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం 3.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇప్పటివరకు కోటి మందికి పైగా వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్నారు. 2,43,01,281 మంది కనీసం ఒక డోసు లేదా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. సిఎం వైయస్ జగన్ గారి స్ఫూర్తితో కోవిడ్ వ్యాక్సినేషన్ ను ఉద్యమంలా చేపట్టిన ఆరోగ్య సిబ్బందికి అభినందనలు. ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్లి పొలాల వద్ద టీకాలు ఇవ్వడం వారి అంకితభావాన్ని సూచిస్తుంది. విజయనగరం జిల్లాలో బురదలో నడుచుకుంటూ వెళ్లిన సిస్టర్లు రాష్ట్ర ప్రతిష్టను పెంచారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజి, విశాఖలో హైఎండ్ స్కిల్ యూనివర్శిటీ, తిరుపతిలో స్కిల్ వర్శిటీల ఏర్పాటుతోపాటు ఐటీఐల్లోనూ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. పరిశ్రమలతో వీటిని అనుసంధానించడం వల్ల యువతకు మెరుగైన ఉపాధి లభిస్తుందని విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.