న్యూఢిల్లీ: విజయనగరంలో రూ.73 కోట్ల నిధులతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయనగరంలో 73.68 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి కార్మిక బీమా సంస్థ (ఈఎస్ఐ) ఆమోదించినట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారని విజయసాయిరెడ్డి తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ ఆస్పత్రిలో ప్రాధమిక వైద్య సేవలతోపాటు ఔట్ పేషెంట్, ఇన్ పేషంట్లకు ప్రత్యేక వైద్య సదుపాయాలను కల్పించబోతున్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ సర్వీసులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, డయాగ్నోస్టిక్స్ సేవలు, మందుల పంపిణీతో వంటి సకల సదుపాయాలను అందుబాటులోకి తీసువస్తున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆయుష్ కింద కూడా రోగులకు సేవలు అందిస్తారని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణాన్ని 2023 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ పథకం పొడిగింపు మధ్య తరగతి ప్రజలు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ రుణాల వడ్డీపై సబ్సిడీ చెల్లింపు పథకం (సీఎల్ఎస్ఎస్)ను ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. రాజ్యసభలో బుధవారం ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద అర్హులైన మధ్య తరగతి ప్రజలు గృహ రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తుందని అన్నారు. అర్హులైన లబ్దిదారులు రుణం పొందిన వెంటనే వడ్డీ మొత్తాన్ని వారి అకౌంట్ ద్వారా రుణం తీసుకున్న సంస్థలకు ప్రభుత్వం బదలాయిస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ కింద గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ పథకాన్ని గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు మంత్రి తెలిపారు. 2020-21 మధ్యకాలంలో ఈ పథకం కింద 1.67 లక్షల మంది లబ్ది పొందారు. పథకం ప్రారంభిన నాటి నుంచి ఇప్పటి వరకు 4.93 లక్షల మంది ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు.