తాడేపల్లి: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కుల, మత వివక్ష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, స్వయంగా స్పీకర్ అయన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వంటి వారి చర్యలే ఇందుకు నిదర్శనమని వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు స్పష్టం చేశారు. తాజాగా అయన్నపాత్రుడు డబ్బు కళాకారుడిని కొట్టడం, రఘురామకృష్ణంరాజు దళిత, క్రై స్తవుల బహిష్కరణ పిలుపులు చూస్తుంటే చంద్రబాబు దళిత వ్యతిరేక భావజాలం మరోసారి బయటపడుతోందని ఆయన చెప్పారు. అదే గత ప్రభుత్వంలో దళిత, క్రై స్తవులకు డిప్యూటీ సీఎం, మండలి ఛైర్మన్ సహా ఎన్నో పదవులు, ఆ వర్గాలకు నిధులు ఇచ్చి జగన్గారు గౌరవిస్తే.. అందుకు భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు వారిని టార్గెట్ చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన టీజేఆర్ సుధాకర్బాబు తెలిపారు. ప్రెస్మీట్లో టీజేఆర్ సుధాకర్ బాబు ఇంకేమన్నారంటే..: ఏపీలో కుల, మత స్వేచ్ఛకు భంగం: ఏపీలో సామాజిక అసమానతలు, కులవివక్ష, మత స్వేచ్ఛకు భంగం కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యే సుప్రీంకోర్టు దళిత క్రై స్తవులకు ఇచ్చిన తీర్పు మీద ఓ పెద్ద అలజడి వస్తే క్రై స్తవ సమాజం బాధపడుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీకి సంబంధించిన శక్తులన్నీ కూడగట్టుకుని ఈ రాష్ట్రాన్ని మతం పేరుతో చిన్నాభిన్నం చేయాలని, కలిసిమెలసి జీవిస్తున్న వారిని విడదీయాలని కుట్రలకు తెర లేపాయి. మరోవైపు దళిత క్రై స్తవులకు ఎస్సీ హోదా కల్పనపై సీఎం చంద్రబాబ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విషయంలో ఆయన మౌనం వహిస్తున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని పలు వేదికలపై క్రై స్తవత్వాన్ని బలపరుస్తూ బైబిల్ పఠనాలు కూడా చేసిన చంద్రబాబు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పన విషయంలో ఏమీ మాట్లాడకపోవడం సరికాదు. చంద్రబాబు మౌనం. హేయం: స్పీకర్ అయన్నపాత్రుడు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన డప్పు కళాకారుడిని చెంపమీద కొడితే చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు. ఈ మధ్యే టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు నేరుగా జాన, బూన అని మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తిట్టాడు. దానిపైనా చర్యలు లేవు. అందుకే చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భావిస్తున్నాం. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఉదయం లేచిన దగ్గరి నుంచీ రోజూ దళిత వ్యతతిరేక వాదం, క్రై స్తవ వ్యతిరేక వాదం, వితండవాదం చేస్తున్నారు. అహంకారంతో కులాల మధ్య అవరోధాలు సృష్టించాలని, కుంపట్లు రగిలించాలని ప్రయత్నిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం కులాన్నే, మతాన్నే ప్రాతిపదికగా చేసుకుని కుట్రపూరిత వ్యవహారశైలికి రఘురామరాజు తెరలేపాడు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పాములాగా దూరాడు. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు మౌనంగా ఉండడం హేయం. దళితులపై రెచ్చిపోతున్న కూటమి నేతలు: ఒకే రోజు రెండు ఘటనలు జరిగాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయన్నపాత్రుడు కొడితే, రైల్వేకోడూరులో మాల సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను జనసేన ఎమ్మెల్యే అనుచరుడు నాగేంద్ర నడిరోడ్డుపై కొట్టాడు. కనీసం ఆ కార్యకర్తకు పవన్ కళ్యాణ్ షోకాజ్ నోటీసు కూడా ఇవ్వలేదు. నాగేంద్ర, ఐ.సుబ్రమణ్యం అనే ఇద్దరు జనసేన కార్యకర్తలు ఇద్దరు మాల సామాజిక వర్గ మహిళల్ని నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొడుతుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏమైందని అడుగుతున్నాం? ఇంకా సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురంలో దళిత మహిళలపై టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా, వారు ఏ మాత్రం స్పందించడం లేదు. మాల, మాదిగ, రెల్లి కులస్తులు జగన్గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, వారు ఈ విషయంలో గట్టిగా ఉన్నారు కాబట్టే మీరు భౌతిక దాడులకు దిగుతున్నట్లు కనిపిస్తోంది. దళిత బంధుగా నిలిచిన జగన్గారితో మీకు పోలికా?: జగన్ గారి వద్ద ఉన్న దళిత సమాజాన్ని మీవైపు తిప్పుకోవాలన్నా, వాళ్ల మనసు మార్చాలన్నా మీ వల్ల కాదు. జగన్గారు సామాజిక, ఆర్దిక న్యాయాన్ని రంగరించి సమాజంలో అట్టడుగు వర్గాలకు అన్ని స్థాయీ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించారు. మాల, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. దళితరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రూ.400 కోట్లతో నిర్మాణం చేశారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు ఇచ్చారు. ప్రత్యేక ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశారు. మా వాళ్లు ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంకా 16 మందికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చారు. పేదల్ని జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్లను చేశారు. తన పదవీ కాలంలో రూ.70 వేల కోట్లను మాల, మాదిగ, రెల్లి కులస్తులకు పంచిన మహానుభావుడు జగన్ ను కాదని మేం ఎలా మీ దగ్గరకు రాగలుగుతాం. కాబట్టి, జగన్గారితో ఏ విషయంలోనూ తనను పోల్చుకోలేరన్న విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుంచుకోవాలని సుధాకర్బాబు హితవు చెప్పారు.